- అరెస్టులు, నిర్బంధాలతో నియంత్రించలేరు
- అదే రోజు చంచల్గూడ జైలులో విద్యార్థులను పరామర్శిస్తారు
- ములాఖత్కు జైలర్ను కలసి రేవంత్ రెడ్డి వినతి పత్రం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ప్రభుత్వం నియంత్రించ లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ పర్యటన కోసం ప్రజాస్వామ్యయుతంగా అనుమతి కోసం ప్రయత్నించిన ఎన్ఎస్యూఐ నేతలను అరెస్టు చేయడంపై రేవంత్ మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాహుల్ గాంధీ ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు చంచల్గూడ కారాగారాన్ని సందర్శిస్తారని తేల్చిచెప్పారు. ఈనెల 7న అరెస్టు అయిన ఎన్ఎస్యూఐ నేతలను కలుస్తారని ప్రకటించారు. ములాఖత్కు సమయం ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్ శివకుమార్ను కాంగ్రెస్ నేతలతో కలిసి వినతిపత్రం అందించారు. ఓయూకి కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు రాహుల్ గాంధీ పార్లమెంట్లో నిలదీస్తారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఓయూలో యూజీసీ నిధులు సరిగా వినియోగం అవుతున్నాయా..ఓయూలో నియామకాలు సరిగా జరుగుతున్నాయా లేదా అని రాహుల్ తెలుసుకుంటారన్నారు. తెలంగాణ రైతులకు అండగా ఉండాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ పర్యటనకు రావాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఓయూ విద్యార్థి నాయకులను రాహుల్ కలిసేందుకు అనుమతి ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. పోరాటానికి విద్యార్థులే ఆదర్శమన్నారు. పార్టీలకతీతంగా విద్యార్థి నాయకులు అరెస్టులను ఖండించాలని.. కేసీఆర్ నియంత పాలనపై తిరుగుబాటు చేయాల్సి ఉందన్నారు.
రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి.. ఓయూ విద్యార్థులతో మమేకమవుతారని అన్నారు. ఓయూలో రాహుల్ సభకు అనుమతి కోసం వినతిపత్రం ఇస్తే.. ప్రభుత్వ ఒత్తిడితో తిరస్కరించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. మే 7న ఎన్ఎస్యూఐ నేతలను రాహుల్ పరామర్శిస్తారని రేవంత్ తెలిపారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ…పంటను కొనే దిక్కులేక రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రైతులకు అండగా నిలవడానికి కాంగ్రెస్ నేత రాహుల్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినది రాహుల్ గాంధీ అని తెలిపారు. తెలంగాణ రైతు ఆత్మ హత్యలతో శవాల దిబ్బగా మారుతుందని అన్నారు. వారికి అండగా నిలవడానికి రాహుల్ వస్తున్నారని తెలిపారు. ఉద్యమంలో ఉస్మానియా కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఓయూను సందర్శించడానికి రాహుల్ వొస్తున్నారన్నారు.
తమ నేతలు జగ్గారెడ్డి, వి.హెచ్, ఓయూ విద్యార్థులు వీసీకి రాహుల్ సభకు అనుమతి కోసం వినతి పత్రం ఇచ్చారని అన్నారు. అయితే ప్రభుత్వ ఒత్తిడితో తిరస్కరించినట్లు చెప్పారు. అనుమతి కోరిన తమ విద్యార్థి విభాగం నేతలను జైల్లో పెట్టారన్నారు. జైల్లో ఉన్న విద్యార్థులను కలవాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సర్కారు అనుమతి ఇవ్వకపోయినా రాహుల్ గాంధీని ఓయూకు తీసుకువెళ్తామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అందుకు శాంతిభద్రతల సమస్య వొస్తే సర్కారే బాధ్యత వహించాలన్నారు. పోలీసులు ఓయూలో అతిగా ప్రవర్తించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. చంచల్గూడ జైలులో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలను పరామర్శించడానికి రాహుల్ వొస్తారని… అందుకు జైలు సూపరింటెండెంట్ను కలిసి అనుమతి ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. వరంగల్లో 6న రైతు సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారని పేర్కొన్నారు. రేవంత్తో పాటు జగ్గారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ జైలర్ను కలిశారు.