- ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే…టీకా వేసుకోవాల్సిందే
- టీకా ఉత్పత్తిలో ఆదర్శంగా హైదరాబాద్
- 12-14 ఏండ్ల పిల్లల వ్యాక్సినేషన్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
- బాలల టీకా ఉత్పత్తి చేసిన బిఇని అభినందించిన మంత్రి
ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 16 : కొరోనా ప్రభావం తగ్గిందే తప్ప ప్రమాదం ఇంకా పొంచి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని, టీకా తీసుకుని, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో 50 పడకల సీహెచ్సీ హాస్పిటల్ ప్రారంభంతో పాటు 12-14 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ పక్రియను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నేషనల్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా 12 నుంచి 14 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ అందించడం సంతోషంగా ఉందన్నారు. కొరోనా అయిపోయిందని, ఇక లేదని అనుకోవడం పొరపాటన్నారు. ఈ నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని, థర్డ్ వేవ్లో కొరోనా ప్రభావం చూపలేదని, టీకా అవసరం లేదనే నిర్లక్ష్య ధోరణి పెట్టుకోవద్దని అన్నారు. చైనా, అమెరికా, హాంకాంగ్లో కొత్త కేసులు వొస్తున్నాయని వింటున్నాం.
డబ్ల్యూహెచ్వో కూడా అన్ని దేశాలను అప్రమత్తం చేస్తుందని ఈ క్రమంలో టీకాను ప్రతి ఒక్కరూ విధిగా వేసుకోవాలని హరీష్ రావు సూచించారు. ప్రపంచంలో కొత్త టీకా రావాలంటే హైదరాబాద్ వైపు చూస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రంపంచానికే తెలంగాణ రాష్ట్రం టీకా హబ్గా మారిందని, కొత్త టీకా అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు ప్రపంచం తెలంగాణ వైపు చూసే పరిస్థితి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బుధవారం ఖైరతాబాద్లో 50 పడకల సిహెచ్ సి హాస్పిటల్తో పాటు 12-14 ఏండ్ల మధ్య వయసున్న పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమం మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. భారతదేశంలో కొరోనా నివారణకు వొచ్చిన మూడు టీకాలలో రెండు హైదరాబాద్ నుంచి వొచ్చినవేనని అందుకు గర్వకారణంగా ఉందన్నారు. భారత్ బయోటెక్ నుంచి వొచ్చినది కొవాగ్జిన్ అని, బయోలాజిక్ ఈ సంస్థ నుంచి వొచ్చినది కొర్బెవాక్స్ అని తెలిపారు. ఈ రెండో టీకా కొర్బెవాక్స్ 12 నుంచి 14 ఏండ్ల లోపు పిల్లలకు వేస్తున్నారని అన్నారు.
బయోలాజిక్ ఈ సంస్థ ఎండీ మహిమా దాట్లకు హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె అద్భుతమైన విజయాలు సాధించారని, మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటూ, ప్రభుత్వం భవిష్యత్లోనూ ఆమెకు సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 106 శాతం పూర్తి చేసుకున్నామని మంత్రి తెలిపారు. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ 97 శాతం పూర్తి చేసుకున్నాం. 15-17 ఏండ్ల లోపు పిల్లలకు సంబంధించి 87 శాతం వ్యాక్సినేషన్ పక్రియ పూర్తయిందన్నారు. 12-14 ఏండ్ల లోపు పిల్లలకు బుధవారం ప్రారంభమైందని, వీరు మైనర్లు కాబట్టి.. తల్లిదండ్రులు చొరవ చూపి టీకా వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, 17 లక్షల మంది పిల్లలు ఉంటారని అంచనా వేశారని, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి తెలిపారు. 60 ఏండ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని గతంలో కేంద్రానికి లేఖ రాశాంమని, ఇందుకు కేంద్రం అంగీకరించిందని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ రోజు నుంచి 60 ఏండ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోసు ఇస్తామన్నారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉందని, మరణాలు కూడా తక్కువగా ఉన్నాయన్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశీలనలో తేలిందన్నారు.
కొరోనా తీవ్రత లేదని నిర్లక్ష్యం చేయొద్దని, ప్రతి ఒక్కరూ కూడా టీకా వేయించుకొని సురక్షితంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్ పక్రియలో విరామం లేకుండా పని చేస్తున్న ఆశా వర్కర్లకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. కొరోనా సమయంలో సేవలు అందించిన వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నేషనల్ వ్యాక్సిన్ డే అయిన మార్చి 16వ తేదీన 12-14 ఏళ్ల పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా కూడా టీకాల కార్యక్రమం నేటి నుండి మొదలవుతుందని, హైదరాబాద్కి చెందిన బయాలజికల్ ఇ లిమిటెడ్ అభివృద్ధి చేసిన కొర్బేవాక్స్ టీకాను అర్హులైన పిల్లలకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కొరోనా థర్డ్ వేవ్ ముగిసిందనో..థర్డ్ వేవ్లో పెద్దగా ప్రభావం చూపలేదనో.. కొత్త వేరియంట్ ఇప్పుడు వస్తుందా? రాదా? అనే అనుమానాలతో టీకాలు వేసుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. అన్ని ప్రభుత్వ పీహెచ్ సీలు, యూపీహెచ్ సీల్లో వాక్సినేషన్ అందించటం జరుగుతుందన్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు వైద్యారోగ్య శాఖ చేసిందని, తల్లిదండ్రుల సమక్షంలో టీకా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, డిఎంఇ రమేష్ రెడ్డి, డిహెచ్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.