కవితను కోర్టులో హాజరుపర్చిన ఈడీ…
కస్టడీని పొడిగించిన కోర్టు
•విచారణకు సహకరించని ఎమ్మెల్సీ కవిత…
రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ వివరణ
న్యూ దిల్లీ, మార్చి 23 : దిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కోర్టు మరో మూడ్రోజులు పొడిగించింది. అలాగే ఆమెకు మెడికల్ చెకప్ చేయిస్తున్నామని ఇడి కోర్టుకు వివరించింది. కస్టడీ ముగియడంతో శనివారం కోర్టులో కవితను హాజరు పర్చిన ఇడి, మరో ఐదు రోజుల కస్టడీ కోరింది. అయితే కోర్టు కేవలం మూడ్రోజులు మాత్రమే అనుమతించింది. అంతకుముందు తమ విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ ఆరోపించింది. సర్ మహీంద్రతో కలిపి కవితను ప్రశ్నించాలని తెలిపింది. లిక్కర్ స్కామ్లో రూ.కోట్లలో కిక్ బ్యాక్లు అందాయని ఈడీ పేర్కొంది. సౌత్గ్రూప్కు రూ.100కోట్లు చేరాయని ఆరోపించింది. కవిత ఫోన్ డేటాను తొలిగించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ కోర్టుకు తెలియజేసింది.
అలాగే ఆమె కుటుంబ సభ్యుల వివరాలను ఇవ్వడం లేదని ఈడీ తరఫు లాయర్ ఆరోపించారు. కవిత మేనల్లుడి వ్యాపారానికి సంబంధించిన వివరాలు అడినట్లు ఈడీ తెలిపింది. ప్రస్తుతం కవిత మేనల్లుడి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయని ఈడీ పేర్కొంది. కవితను ఆమె మొబైల్ ఫోన్కు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ నివేదికతో విచారిస్తున్నామని ఈడీ తరఫు లాయర్ తెలియజేశారు. సోదాల్లో మేనల్లుడి ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతకుముందు డియాతో మాట్లాడిన కవిత ఈ కేసుల రాజకీయ కోణంలో కుట్ర కేసుగా అభివర్ణించారు. ప్రస్తుతం కవిత ఈడీ విచారణను ఎదుర్కుంటున్నారు. అయితే విచారణ సమయంలో కవిత తీవ్రమైన రక్తపోటును ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పీఎంఎల్ఏ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు నియంత్రణలోకి రావడం లేదని, ఈడీ అధికారులు వైద్య పరీక్షలు నివేదికలు అందించడం లేదని పిటిషన్లో తెలిపారు. వైద్య పరీక్షలు నివేదికలిచ్చేలా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానంలో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మెడికల్ రికార్డస్ రిపోర్టస్ అందించాలంటూ ఎమ్మెల్సీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈనెల 15 నుంచి కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. కస్టడీలో తనకు నిర్వహించిన మెడికల్ రిపోర్టస్ అందించాలని పిటిషన్లో కోరారు. అరెస్ట్ అయిన 15వ తేదీ నుంచి హైపర్ టెన్షన్తో కవిత ఇబ్బంది పడుతున్నారు. 15న న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన సమయంలోనే హైపర్ టెన్షన్ విషయాన్ని తన న్యాయవాదికి కవిత చెప్పారు. ఆ విషయాన్ని కవిత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కవిత తరపు న్యాయవాదు లకు మెడికో లీగల్ రిపోర్ట్ అందించాలని ఈడీని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే కోర్టు ఆదేశించిన తర్వాత కూడా కేవలం 15 ,16వ తేదీల మెడికల్ రిపోర్ట్ మాత్రమే అందించారని కవిత పిటిషన్లో వెల్లడించారు. తన తరపు న్యాయవాదులు కోరినప్పటికీ కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి మెడికో లీగల్ రిపోర్ట్లు అందించలేదని తెలిపారు. 15, 16వ తేదీల్లో అందించిన మెడికల్ రిపోర్టస్లో రక్తపోటు 186/103 గా ఉందని, రక్తపోటు నియంత్రణ కోసం చిన్నపాటి ఇంజక్షన్ ఇచ్చినప్పటికిని రక్తపోటు 146/96గా ఉందని ఎమ్మెల్సీ పిటిషన్లో పేర్కొన్నారు. హైపర్ టెన్షన్ తగ్గించేందుకు మెడిటేషన్ చేస్తున్నప్పటికీ తగిన ఫలితాలు కనిపించడం లేదని తెలిపారు. కస్టడీలో హైపర్ టెన్షన్ నియంత్రణలోకి రావడం లేదని..15వ తేదీ నుంచి అన్ని వైద్య పరీక్ష నివేదికను అందించాలని కవిత తన పిటిషన్ కోరారు. మరోవైపు దిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఈడీ కస్టడీ విచారణ శనివారంతో ముగియనుండగా ఇడి కస్టడీని కోర్టు మరో మూడ్రోజులు పెంచింది.





