‘‘ రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి తెలుగు వారు సమైక్యం కావడానికి కృషి చేయాలని జనధర్మలో 43 ఏళ్ల కిందట 1989 సంపాదకీయంలో ఆచార్య రాసిన అంశాలు. విచిత్రమేమంటే 2014లో పార్లమెంట్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చట్టాలలో అనేకానేక విషయాలు అమలు చేయడం లేదు. పార్లమెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా భద్రాచలం పరిసరాల్లో ఏడు గ్రామాలను అన్యాయంగా ఆంధ్రకు చేర్చడం, అదేవిధంగా తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ కు కూడా స్పెషల్ హోదాను వదిలేయడం కూడా కేంద్రం చేసిన అన్యాయమే..’’
జనధర్మో విజయతే
వరంగల్ అంటే పత్రికలకు అడ్డా. హైదరాబాద్ లో ఒకటి రెండు పత్రికలు కాకుండా, విజయవాడ నుంచి మద్రాస్ నుంచి మాత్రమే పంపేవారు. అప్పట్లో ఆంధ్రపత్రిక చాలా గొప్ప పత్రిక. అప్పుడు వరంగల్ జిల్లా ఆంధ్రపత్రికే ఉద్యమానికి ఊపిరి, అక్కడ ఏజెంట్ గా నిలబ డడమే గొప్ప అనుకునే రోజులు. యం యస్ ఆచార్య జీవనం ఆంధ్రపత్రిక ఏజెంట్, అక్కడినుంచే పత్రికా రచన ప్రారంభించి, సంపాదకుడుగా ఎదిగిన వ్యక్తిత్వం ఆయనది.
ఆయుధం కలం, సరిగ్గా 100 ఏళ్ల కిందట ఈరోజున అంటే అక్టోబర్ 3న జన్మించిన ఎం ఎస్ ఆచార్య, తెలుగు మాట్లాడితే నేరంగా పరిగణించే నిజాం పాలనలో తెలుగు పత్రికకు వార్తలు రాసే విలేకరిగా పనిచేసినాడు. వార్తలున్న ఆ పత్రికను రహస్యంగా పంచిపెట్టేవాడు. అదే ఆయన ఉద్యమం ఉద్యోగం, జీవనం, జీవనభృతి కూడా, రజాకార్ల దౌర్జన్యాలకు భయపడి వరంగల్లు వదిలి వందలాది కుటుంబాలు ఇళ్లు ఖాలీ చేసి వెళ్లిపోతే జనం లేని వీధుల్లో కందిలీ ఒక చేత లాఠీ మరొక చేత పట్టుకుని ప్రతాపరుద్ర దేశం కార్యకర్తగా కాపలా కాసిన సాహసి, నెల్లికుదురు గ్రామంలో తండ్రి ప్రసన్న రాఘవాచార్య దగ్గరికి వైద్యం కోసం వచ్చిన ఆజాత విప్లవ వీరుడు దేవులపల్లి వెంకటేశ్వరరావు జీవితం తనకు స్ఫూర్తి అని చెప్పినారు.
వావిలాల గోపాలకృష్ణయ్య తెనాలిలో స్వాతంత్య్రానికి పూర్వం నిర్వహించిన జర్నలిజం శిక్షణా శిబిరంలో పాత్రికేయ వృత్తి మెలకువలు నేర్చుకున్నారాయన. ఆయన ఆరంభించిన అక్షర సంగ్రామమే ఆచార్య చేత ఆ తరువాత జనధర్మ వారపత్రిక ప్రారంభింపజేసింది. ముప్ఫై ఏళ్ల తరువాత వరంగల్ వాణి దినపత్రిక ప్రచురణ మొదలు పెట్టారు. కలం ఆగిన తరువాత జులై 12, 1994న ఆయన ఊపిరి ఆగిపోయింది.
తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వాలే దాదాపు అన్నీ ఆంధ్రప్రాంత వారివే. యం యస్ ఆచార్య రాసిన సంపాద కీయంలో ఘాటైన వాక్యాలు ఇవి చదవండి. తెలంగాణ మీద, తెలం గాణా ప్రాంతంలో నివసించే ఉద్యో గుల మీద అమితమైన బాధ్యత లున్నాయి. ఉభయ ప్రాంతాల ప్రజల మధ్య రెచ్చిపోయిన విద్వేషానలాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటి? నాయకుల్ని జైల్లో వేయడం ఆంధ్రుల ఇళ్లకు సాయుధ పోలీసులు కాపలా కాయడం వంటి చర్య విద్వేషం నిర్మూలనకూ విశ్వాసం నెలకొల్పుటకు గాక మరింత ద్వేషానికే కారణం కావడం లేదా? పైగా ఇటీవల మంత్రి పదవులను అలంకరించిన వారి ప్రసంగాలు జనాన్ని కవ్వించేదిగానే ఉంటున్నా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మంత్రిబాధ్యతలు నిర్వహించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి వంటి తెలంగాణా నాయకుడు, ఇటువంటి విచక్షణా రహితమైన దమనకాండను సాగించే పోలీసు వారిపై తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకోగలదని ప్రకటించవలసి వచ్చిందంటే పోలీసుల హింసాకాండ ఏ స్థాయికి చేరుకున్నదో చెప్పనక్కరలేదు…..
తెలంగాణాకు ఇవ్వబడిన రక్షణలలో ముల్కీలకు నాన్ గెజిటెడ్ ఉద్యోగాల రిజర్వు ఒకటి. ఇందుకోసం ముల్కీ రూల్స్ అమలుకు వచ్చాయి. ముల్కీలకు రిజర్వు చేయబడిన ఉద్యోగులలో 10 శాతం మంది నాన్ ముల్కీలు, దొంగ ముల్కీలు నియామకమైనా 10 శాతం రూల్స్ ప్రకారం ముల్కీలకు లభించాయి. 12 సంవత్సరాలుగా లభిస్తున్నాయి. ఈ నాన్ ముల్కీల స్థానే ముల్కీలకే రావాలని ఆందోళన చేయగా ప్రభుత్వం ప్రతిపక్షాలు అంగీకరించాయి. ముల్కీ రూల్సు రాజ్యాంగ విరుద్ధమనే కోర్టు తీర్పును ఆంధ్ర ఉద్యోగులు పొందారు. ఏ ముల్కీ రూల్స్ ప్రకారం తమకు ఉద్యోగాల విషయములో రక్షణ ఉన్నదని ప్రాంతీయులు నమ్మారో అవి రాజ్యాంగ విరుద్ధమైనవైతే గత 12 సంవత్సరాలుగా అవి అమలులో ఎట్లా ఉన్నాయి. ఈ 12 సంవత్సరాలలో ఏ ఆంధ్ర ఉద్యోగి కూడా కోర్టుకు వెళ్లలేదేమి? ముల్కీ నిబంధనలు 1964లో తిరిగి అయిదేళ్ల కాలం పొడిగించినప్పుడైనా కోర్టుకు వెళ్లలేదేమి? రక్షణలు ఒకవైపున ఉన్నా దొడ్డిదారిన ఉద్యోగాలు తమకు లభింపజేసినంత కాలం వీరు కోర్టుకు వెళ్లలేదా? ఈ రహస్యం బట్టబయలై ప్రజాందోళన ప్రారంభమై ప్రభుత్వం తానే నాన్ ముల్కీలను ఖాలీ చేయించే స్థితి వచ్చినపుడు కోర్టుకు వెళ్లారా? ఇదంతా తమను మోసగించడానికే అనే దృతాభిప్రాయం ప్రజలకు ఏర్పడడంలో ఆశ్చర్యం లేదు అని జనధర్మ సంపాదకీయం ఘాటుగా రాసారు.
ప్రభుత్వం సమస్త సాయుధ పోలీసు బలగం అండన ఉన్నా తమకు రక్షణ లేదనే భీతాహంలో ఆంధ్ర కుటుంబాలవారు పడి పోయినప్పుడు, ఆంధ్ర ప్రాంతపు జైళ్లలో తెలంగాణా నాయకులపై ఘోరాలు జరగవచ్చుననీ, చదవవలసి విద్యార్థులకు ఆంధ్ర ప్రాంతము కళాశాలల పాఠశాలల్లో ఉస్మానియా విశ్వ విద్యాలయాధికారులు ఏర్పాటు చేసినప్పడికీ తమ పిల్లలకు అపాయము కలుగుతుందని ఇక్కడి ప్రజలు భీతాహపడటంలో వింత ఏమీ లేదు. రాష్ట్రపతి పాలనను విధించడం, 1950 ఒప్పందం అనుసరించి ఇవ్వబడిన రక్షణలను అన్నింటినీ అమలు చేయడం, తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయాలా వద్దా అనేది రిఫరెండం పెట్టటం వంటి చర్యలే ప్రజా విశ్వాస పునరుద్ధరణకు దోహదం చేస్తాయి. రాష్ట్ర సమైక్యతకు పటిష్ట రూపం ఏర్పడి సుస్థిరము కావడమో లేక రెండు తెలుగు భాషా రాష్ట్రాలు ఏర్పడి ఉభయ రాష్ట్రాల ప్రజల మధ్య సుహృద్భావ సంబంధంలు సుదృడం అవటమో ఇందువల్ల జరుగుతుంది. రిఫరెండం మొదటి ఫలితాన్నిదైనా సరేసరి. లేక రెండో ఫలితమే అయితే సుహృద్భావ సంబంధాలు సుదృడమయిన తరువాత కొంత కాలానికి రెండు తెలుగు రాష్ట్రాలు శాశ్వతముగా సమైక్యం కాగల వీలయినా కలుగు తుంది అని జనధర్మ సంపాదకీయం వివరించింది.