– నాడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు
– ప్రభుత్వ విప్ శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని తెలంగాణ ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. స్వలాభం కోసం, ఎంపీ సీట్ల కోసం తెలంగాణ నీటిని, ప్రజలను ఏపీకి కేసీఆర్ తాకట్టు పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాశ్వతంగా తెలంగాణకు కేసీఆర్ నష్టం చేశారని ఆగ్రహించారు. గురువారం సీఎల్పీ మీడియా పాయింట్లో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ దిల్లీలో గద్దె ఎక్కడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావన్నారు. కేసీఆర్ రాయలసీమను రతనాల సీమ చేస్తాననే విషయాన్ని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి మర్చిపోయినట్లున్నారని విమర్శించారు. రాజకీయాల కోసం రైతులను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్వర్ రెడ్డి రోజుకో కొత్త డ్రామాకు తెరదీస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో ఏపీకి అదనంగా తరలించుకు పోయిన నీటి గురించి వైసీపీ నేతలే ప్రెస్మీట్లు పెట్టి మరీ చెబుతున్నారన్నారు. గతంలో జగన్ రెడ్డి సీఎం హోదాలో అసెంబ్లీ వేదికగా శ్రీశైలం నుంచి తీసుకెళ్తున్న నీటిని ప్రస్తవించలేదా అని నిలదీశారు. కేసీఆర్ సహకారంతో ప్రాజెక్టులను పెంచుతున్నట్లు జగన్ అసెంబ్లీలో చెప్పారన్నారు. జగన్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు జగదీశ్ రెడ్డి ఎక్కడ ఉన్నారని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నా దేవుడి దయ వల్ల వర్షాలు పడుతున్నాయని చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ నేతలు కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. కృష్ణాలో 500 టీఎంసీల నీటి కోసం కాంగ్రెస్ కోట్లాడుతోందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బేసిన్లు లేవు, భేషజాలు లేవని చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ విమర్శలకు తాము అసెంబ్లీలో చర్చిస్తామని, కేసీఆర్ సభకు రావాలని శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు