- అలాంటి సామాజిక వర్గం నుంచి వొచ్చిన యోధుడు దొడ్డి కొమురయ్య
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- దొడ్డి కొమురయ్య కురుమ భవన్ ప్రారంభం
నమ్మకానికి, మృదుస్వభావానికి మారుపేరు కురుమ కులస్థులని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి సామాజిక వర్గం నుంచి వొచ్చిన యోధుడు దొడ్డి కొమురయ్య సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపించారని కొనియాడారు. ఆయన పేరుతో దొడ్డి కొమురయ్య భవన్ ను ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు. కురుమ విద్యార్థులు చదువుకునేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని, ప్రభుత్వ హాస్టల్స్ లో డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచేందుకు గత ప్రభుత్వానికి మనసు రాలేదని, కానీ తమ ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తోందన్నారు. రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్.. ఇలా అన్ని సంక్షేమ పథకాల్లో బలహీనవర్గాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, కంచె ఐలయ్య చెప్పినట్లు జమీందార్ల తెలంగాణ తల్లి కాదు.. బహుజనుల తెలంగాణ తల్లిని మనం తెచ్చుకున్నామని వివరించారు. బిడ్డలు అభివృద్ధి పథం వైపు నడవాలని ఆశీర్వదించే తల్లిని మనం ప్రతిష్ఠించుకున్నామని చెప్పారు.
కులగణనలో తెలంగాణ దేశానికే ఆదర్శంమని, కులగణన 98 శాతం పూర్తయిందని, ఇంకా కేవలం 2 శాతం మాత్రమే మిగిలి ఉందన్నారు. కులగణన మెగా హెల్త్ చెకప్ లాంటిదని, కులగణన పూర్తయితే కురుమలకు జనాభా ప్రాతిపదికన దక్కాల్సిన వాటా దక్కుతుందని వివరించారు. గత ఎన్నిల్లో కాంగ్రెస్ కురుమలకు రెండు, యాదవ సోదరులకు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిందని గుర్తుచేశారు.మీరు కలిసికట్టుగా గెలిపంచుకున్నప్పుడే రాజకీయ పార్టీలు మళ్లీ టికెట్లు ఇస్తాయని, ముఖ్యమంత్రిగా విప్ లే నా కళ్లు, చెవులు అని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో నాలుగు సామాజిక వర్గాలకు విప్లుగా అవకాశం కల్పించామని, బీర్ల ఐలయ్య విప్గా ఉన్నా కాబట్టే మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాడని చెప్పారు.
వొచ్చిన అవకాశం వదులుకోవద్దు.. మీ బిడ్డలను మీరు గెలిపించుకుంటేనే మీకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టంచేశారు. వేర్వేరు పార్టీల్లో ఉన్నా… కొన్ని సందర్భాల్లో మీ సామాజిక వర్గాలను గెలిపించుకోవాలని, అప్పుడే ఈ సమాజంలో మీకు మనుగడ ఉంటుందన్నారు. ఈ ప్రభుత్వం మీది.. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు.భవిష్యత్ లో రాజకీయంగా, ఆర్ధికంగా మీ కోటా మీకు వొచ్చేలా చూసే బాధ్యత తమదని, కంచె ఐలయ్య సూచనను పరిశీలిస్తామని, దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.