– కేంద్రం అధికార దుర్వినియోగం చేసినా ప్రజలు మావెంటే
– వీడియో సందేశం విడుదల చేసిన మమతా బెనర్జీ
కోల్కతా, ఏప్రిల్ 30: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 226 కంటే ఎక్కువ సీట్లను టీఎంసీ గెలుస్తుందని స్పష్టం చేశారు. ‘మా-మాటి-మానుష్’ స్ఫూర్తితో టీఎంసీ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావడానికి పశ్చిమ బెంగాల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మమతా బెనర్జీ ఓ వీడియో సందేశం పోస్టు చేశారు.ఎన్నికల ఫలితం ఇప్పటికే తమ పార్టీకి అనుకూలంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన పూర్తి యంత్రాంగాన్ని రంగంలోకి దించినా.. విజయం మాత్రం టీఎంసీదే అని తేల్చి చెప్పారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలపైనా మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ఎగ్జిట్ పోల్ గణాంకాలను బీజేపీ కార్యాలయం నుంచే విడుదల చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. తమ పార్టీ కార్యకర్తలు, నేతల్లో భయాందోళనలు సృష్టించేందుకు బీజేపీ సంఖ్యలను తారుమారు చేసిందని మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో తన మద్దతుదారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేశారని ధ్వజమెత్తారు. రెండో దశ ఎన్నిక వేళ తన నియోజకవర్గం భవానీపూర్లో రాత్రంతా దాడులు జరిగాయని మమతా ఆరోపించారు. వోట్ల లెక్కింపు నాడు పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మమతా కోరారు. రాష్ట్ర ప్రజలంతా ఐక్యంగా ఉండి లెక్కింపును నిశితంగా గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో విజయం టీఎంసీదే అని మరోసారి స్పష్టం చేశారు మమతా బెనర్జీ. కాగా, బుధవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిశాయి. దీంతో వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. అందులో మెజారిటీ పోల్స్.. బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నాయి. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ వీడియో సందేశం రిలీజ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




