– గేటు లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు అసెంబ్లీని ముట్టడించారు. అసెంబ్లీ ప్రధాన గేటు వద్దకు చేరుకున్న వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అసెంబ్లీ గేటు లోపలికి చొచ్చుకెళ్లేందుకు నిరుద్యోగులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. నిరుద్యోగులు వెంటనే కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నినదించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసు శాఖలో ఖాళీలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ప్రతిపాదించిన పోస్టులను 20 వేలకు పెంచాలని పోలీసు ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం 7,437 పోలీసు పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి లక్షలాదిగా నిరుద్యోగులు తరలిరావాలని నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు భారీగా నిరుద్యోగులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





