– నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి
– ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13 : యునాని వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని, నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్లో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయుష్ శాఖ పనితీరు, నిజామియా టిబ్బీ హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, నిర్మాణ పనులు, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా సమీక్షించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ నిజామియా టిబ్బీ కాలేజీ, నిజామియా జనరల్ హాస్పిటల్ రాష్ట్రంలో యునాని వైద్య సేవలకు ప్రతిష్ఠాత్మక సంస్థలని మంత్రి పేర్కొన్నారు. వాటి అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. హాస్పిటల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవనం పనులను వేగవంతం చేయాలని టీజీఎంఎస్ఐడీసీ చీఫ్ ఇంజనీర్ను ఆదేశించారు. వచ్చే జనవరి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. డాక్టర్లు, టీచింగ్ ఫ్యాకల్టీ, ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నందున వైద్య సేవలు, విద్యా కార్యకలాపాలపై ప్రభావం పడకుండా వెంటనే ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తుకి మంత్రి సూచించారు. యునాని డిస్పెన్సరీలు, హాస్పిటల్స్లో అవసరమైన మందులు, పరికరాలు, మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్బాబు మాట్లాడుతూ ఆయుష్లో గతేడాది 138 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడంతో డాక్టర్ల కొరత తీరిందన్నారు. నిజామియా టిబ్బీ కాలేజీ, నిజామియా జనరల్ హాస్పిటల్ వారసత్వ భవనాల పునరుద్ధరణ, కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.52.50 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించినట్లు వివరించారు. మందుల కొనుగోలు, పంపిణీ కూడా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శాఖ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కూడా మంత్రి ఆరా తీశారు. రాష్ట్రస్థాయి యునాని డ్రగ్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సిద్ధం చేసిన ప్రాజెక్టు ప్రతిపాదనను వేగవంతం చేయాలని సూచించారు. మౌలాలిలోని ప్రభుత్వ యునాని డిస్పెన్సరీ భవనానికి సంబంధించిన సమస్యలను పరిశీలించి అక్కడ యునాని వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ, నిజామియా టిబ్బీ హాస్పిటల్ సూపరింటెండెంట్, శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చిన్నారులకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ల పంపిణీ ప్రారంభం
పిల్లల్లో నులిపురుగుల(నట్టలు) సమస్యను నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రాజ్భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రారంభించారు. స్కూల్ పిల్లలకు మంత్రి ట్యాబ్లెట్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్ర తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల్లో నులిపురుగులు ఉండడం వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. ఈ సమస్యల కారణంగా పిల్లల్లో చదువుపై శ్రద్ధ తగ్గిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. నులిపురుగులు బయటకు కనిపించకపోయినా పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ఈ మాత్ర వల్ల నులి పురుగుల సమస్య తొలగిపోయి పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆహారంలోని పోషకాలు శరీరానికి బాగా అందుతాయని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని, చదువుపై ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం కూడా మెరుగుపడుతాయని మంత్రి వివరించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన తాగునీరు ఉపయోగించడం, పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి తినడం వంటి మంచి అలవాట్లపై కూడా పిల్లలకు, వారి తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, హైదరాబాద్ డీఎంహెచ్వో డాక్టర్ పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
96,81,855 మంది చిన్నారులు, విద్యార్థులకు మాత్రలు
విద్యా, మహిళా, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సున్న 96,81,855 మంది చిన్నారులు, విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందజేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు ఏ కారణంతోనైనా మాత్ర వేయించుకోలేకపోయిన పిల్లలకు ఈనెల 20న మాప్-అప్ కార్యక్రమం ద్వారా తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్ర వేయనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





