రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్‌, బీజేపీల డ్రామాలు

– మాజీ మంత్రి హరీశ్‌ రావు ధ్వజం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది.. ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాక బీసీ రిజర్వేషన్ల పెంపు ఆపే వారు ఎవరు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నించారు. పార్లమెంటులో బీజేపీకి 240మంది ఎంపీల, కాంగ్రెస్‌కు 99మంది ఎంపీల బలం ఉంన్నపుడు రిజర్వేషన్ల బిల్లు పెంపును అడ్డుకునేది ఎవరు అని నిలదీశారు. రిజర్వేషన్ల పెంపుపై దిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీలను మభ్యపెడుతూ గల్లీలో డ్రామాలు చేస్తున్నాయని, బీసీలను అవమానిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆరుసార్లు జనాభా లెక్కింపు చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఏనాడూ బీసీ గణన చేయలేదన్నారు. బీజేపీి అయితే ఏకంగా జనగణనను నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్నదన్నారు. గత 35 ఏళ్ళల్లో ఈ దేశాన్ని కాంగ్రెస్‌ 15 ఏళ్లు, బీజేపీ 17 ఏళ్లు పాలిస్తే ఏనాడూ ఈ రెండు పార్టీలకు బీసీలు గుర్తుకు రాలేదని, కానీ ఇప్పుడు ఆ పార్టీలు రెండూ బీసీలపై కపట ప్రేమ నటిస్తున్నాయని వరు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని 2005లోనే కోరిన దేశంలోనే ఏకైక నేత కేసీఆర్‌ అని, రిజర్వేషన్లు పెంచాలని రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడమేకాక స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ పార్టీలకు చలనం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ రిజర్వేషన్లు పెంచలేదు.. బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జితాని అబాది ఉత్నా హäక్‌ అని నినదించే రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ులో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ఎందుకు పెట్టడం లేదు? కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి గానీ, బండి సంజయ్‌ గాని, ఎనిమిదిమంది బీజేపీ ఎంపీలు గాని ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఇప్పుడు ఒకరిని మించి ఇంకొకరు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధించాల్సిందిపోయి కాలయాపన చేస్తున్నాయన్నారు. ఏ పార్టీ బిల్లు పెట్టినా దానికి బీఆర్‌ఎస్‌ పూర్తి మద్దతు ఉంటుంది.. ఎలాంటి పోరాటానికైనా కలిసి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా గల్లీలో డ్రామాలు కట్టిపెట్టి దిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం మొదలుపెట్టాలని కాంగ్రెస్‌, బీజేపీలను బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తున్నదని హరీష్‌రావు అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page