- నాటి టీఆర్ ఎస్ ఉద్యమ జెండాపై రైతునాగలి
- పార్టీ ఆవిర్భవానంతర మొదటి ఎన్నికల్లో జయకేతనం
- రైతు నాగలి గుర్తుతో స్థానిక సంస్థల ఎన్నికల్లోకి ఉద్యమం
- నాటి టీఆర్ఎస్ తొలిపోటీలో 82 జిల్లా పరిషత్ సభ్యులు
- అప్పటి గులాబీ జెండాను భద్రంగా దాసిన పెద్ది
- నర్సంపేట నల్లబెల్లి నుంచి జడ్పీటీసీ గా పోటీ చేసిన బ్యానర్
- మళ్లీ కేసీఆర్ చేతులమీదుగా పునరావిష్కరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17 : టీఆర్ఎస్ పార్టీ (TRS Party) ఆవిర్భావం 27 ఏప్రిల్ 2001 లో జరిగింది. ఆవిర్భవించిన రెండు నెలల్లోనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో స్ధానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. తెలంగాణ సాధన లక్ష్యంగా ఉద్యమ సారథి కేసీఆర్ దార్శనికత తో స్థాపించిన టీఆర్ ఎస్ పార్టీ జనం తీర్పు కోసం అధినేత నిర్ణయంతో ఎన్నికల్లో పాల్గొంది. కేసీఆర్ నిర్ణయం మేరకు 2001 జూలై 3 న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి టీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను నిలిపింది.
టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమాజం బ్రహ్మరథం పట్టింది. ఆ ఎన్నికల్లో 82 మంది టీఆర్ఎస్ జెడ్పీటీసీలు జయకేతనం ఎగురవేశారు. ఆ ఎన్నికల్లో నర్సంపేట, నల్లబెల్లి స్థానం నుంచి జెడ్పీటీసీగా నర్సంపేట మాజీ ఎంఎల్ఏ నాడు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు. కాగా.. ఆ సందర్బంలో క్లాత్ మీద బ్రష్ తో రాయించిన ఎన్నికల ప్రచార బ్యానర్ ను, పార్టీ 25 ఏండ్ల సిల్వర్ జూబ్లీ వేడుకల నేపథ్యంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు చేత పునరావిష్కరణ చేయించారు. ఆనాటి పార్లమెంటరీ ఉద్యమ పంథా పోరాట జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇతర పార్టీ నేతలు.
కాగా…నాటి బ్యానర్ ను భద్రపరిచి ఉద్యమ సందర్భాన్ని మరోసారి స్మరించుకునేలా చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి బృందాన్ని అధినేత కేసీఆర్ అభినందించారు. రజతోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎంఎల్ఏ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, పార్టీ సీనియర్ నేత గ్యాదరి బాలమల్లు తదితర ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు పాల్గొన్నారు.