మన్మోహన్‌ మృతికి టిపిసిసి సంతాపం

వారంపాటు రాజకీయ కార్యకలాపాలకు దూరం: టిపిసిసి చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ మృతితో వారం రోజుల పాటు సంతాప దినాలుగా కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం కార్యాలయాలకు, విద్యా సంస్థలకు శుక్రవారం సెలవును ప్రకటించారు. నేటి కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలతో పాటు జనవరి 3 వరకు అన్ని రాజకీయ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. మన్మోహన్‌ సింగ్‌ మృతికి ఆయన సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ సద్గుణం, నిష్కళంకమైన చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని అన్నారు. నవ భారతదేశానికి నిజమైన వాస్తుశిల్పిలలో డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఒకరని అన్నారు.

భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణం వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసినట్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గ్టటెక్కించిన మహా ఆర్థిక మేధావిగా ఆయన్ను కొనియాడారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌ చేసిన సేవలు దేశం ఎన్నటికీ మరిచిపోదన్నారు. నిజాయితీ, మంచితనం, సమర్థవంతంగా పని చేయడంలాంటివి మన్మోహన్‌ సింగ్‌ ను చూసి నేర్చుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page