– నష్టపోతున్న రైతులను ఆదుకుంటాం
– ఇక్కడినుంచే సమీక్షలతో పెట్టుబడులు ఆహ్వానిద్దాం
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్కు శంకుస్థాపన
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : భారత్ ఫ్యూచర్ సిటీని అద్భుతమైన నగరంగా అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. అందరం కలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట్లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి మంగళవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగపూర్, టోక్యో, న్యూయార్క్లా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, జూన్ 2లోగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించుకుందామని చెప్పారు. ఇకపై ఇక్కడి నుంచే సమీక్షలు నిర్వహించి పెట్టుబడులను ఆహ్వానిద్దామన్నారు. ఆనాడు ఔటర్ రింగు రోడ్డు నిర్మించేటప్పుడు ఇది అయ్యేది కాదని చాలామంది అనుకున్నారు కానీ 160.500 కి.మీ ఔటర్ రింగు రోడ్డు దేశంలో ఏ నగరానికి లేదు అని తెలిపారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు.
ఎవరికీ నష్టం కలగదు
మీ సమస్య పరిష్కారానికి తమ మంత్రి శ్రీధర్బాబు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, పేదల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు సూచిస్తున్నానని సీఎం అన్నారు. మీరు సహకరిస్తే దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అద్భుతమైన నగర నిర్మాణానికి వేగంగా అడుగులు పడతాయన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వారైనా ఇక్కడకు వచ్చి పెట్టుబడులు పెట్టేలా ఫ్యూచర్ సిటీని తీరిదిద్దుతామని చెప్పారు. దేశంలో ఏడు బుల్లెట్ రైళ్లు మంజూరు చేస్తే మూడు మన రాష్ట్రానికే వచ్చాయని, బెంగుళూరు- హైదరాబాద్, శంషాబాద్- పూనే, శంషాబాద్- అమరావతి- చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్కు మార్గం సుగమమైందని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో అద్భుతం జరగబోతోంది.. అభివృద్ధికి అందరూ సహకరిస్తేనే ఆ అద్భుతం ఆవిష్కృతమవుతుందన్నారు. నాపై నమ్మకం ఉంచండి.. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది అని సీఎం స్పష్టం చేశారు. తాము అభివృద్ధి చేస్తామంటే కొందరు ఏడుపులు మొదలుపెట్టారంటూ మీరు ఏడుస్తూనే ఉండండి.. మేం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళతాం అని వ్యాఖ్యానించారు. దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసుల కుల గురువు శుక్రాచార్యుడు మారీచుడు, సుబాహుడులను పంపి భగ్నం చేయాలని ప్రయత్నించే వారు. రాష్ట్రంలో కూడా ఫామ్ హౌస్లో ఉన్న శుక్రాచార్యుడు మన అభివృద్ధి యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు మారీచుడు, సుబాహుడిని పంపాడు.. వాళ్ల మాటలను సీరియస్గా తీసుకోవాల్సిన పనిలేదు అని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఇవాళ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కు శంకుస్థాపన చేసుకున్నామని, ఈ వేదికగా మావోయిస్టులకు పిలుపునిస్తున్నా.. ఇంకా ఎవరైనా మావోయిస్టులు అడవుల్లో మిగిలిపోతే వచ్చి జనజీవన స్రవంతిలో కలవండి అన్నారు. మీ ఆరోగ్యం, మీకు భరోసా కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అని హామీ ఇచ్చారు.
గిరిదర్శక్లకు నియామక పత్రాలు 
గిరి దర్శక్ కార్యక్రమంలో భాగంగా 20మంది గిరిజన యువతకు ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందించారు. పర్యాటక అభివృద్ధితోపాటు గిరిజన యువతకు జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో గిరి దర్శక్ కార్యక్రమం చేపట్టామని, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో గిరిదర్శక్ల నియామకానికి యువతను ఎంపిక చేసి శిక్షణ అందించామని, గిరి దర్శక్లు పర్యాటకులకు స్థానిక సంస్కృతి, చరిత్రను వివరిస్తారని చెప్పారు. అటవీ నియమాలు పాటించేలా చూడటంతోపాటు పర్యాటకులకు భద్రత కల్పించనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





