ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డు..

వడ్ల కొనుగోళ్ళకు సర్వం సిద్ధం చేశాం..
రాష్ట్ర వ్యాప్తంగా 8,329 కొనుగోలు కేంద్రాలు
127.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
70.13లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తాం..
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 19 :  రాష్ట్రంలో యాసంగి సీజన్ లో రికార్డ్ స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అవుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రబీ సీజన్ లో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఎర్రమంజిల్ కాలనీ లోని పౌర సరఫరాల శాఖా కేంద్ర కార్యాలయం నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డిఎస్.చౌహన్, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ జాయింట్ కమిషనర్ ప్రియాంక ఏలే, డైరెక్టర్ ప్రసాద్ తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆదిలాబాద్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు అంశం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆయా జిల్లాల కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్ లో రైతాంగం సాగు చేసిన 57 లక్షల ఎకరాల్లో 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుందని ఆయన వెల్లడించారు. ఈ సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని ఇది తెలంగాణలో మాత్రమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు యావత్ భారతదేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసుకుందన్నారు.

కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలి
ఖరీఫ్ సీజన్ లో 66.7 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే 153.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కాగా ప్రస్తుత రబీ సీజన్ లో 57 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనలో ఎటువంటి లోటు పాట్లు లేకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ సూచించారు. ఖరీఫ్ సీజన్ లో రికార్డ్ స్థాయిలో పండిన పంటను కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు,మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు సమర్థవంతంగా వ్యవహరించారని ఆయన ప్రశంసించారు. ధాన్యం కొనుగోళ్లు సున్నిత మైన అంశమని అధికారులు అప్రమత్తంగా ఉంటూ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతాంగాన్ని చైతన్య పరచాలన్నారు.

ఏప్రిల్ రెండో వారం పూర్తయ్యేనాటికి 8.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరగా ఇప్పటికే 5.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో సన్న రకాలు 3.79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండగా 1.98 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకాలని  ఆయన వివరించారు. సన్నాలు పండించిన రైతాంగానికి బోనస్ లు ఎప్పటికప్పుడు వారి వారి ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఇప్పటికి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద 2.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేరి ఉందన్నారు.

ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 8,329 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోగా ఇప్పటికే 7,337 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. సుమారు 88 శాతానికి పై బడి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా ఇవి పిఏసిఎస్, ఐకేపి గ్రూపుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయన్నారు నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా మిగిలిన జిల్లాలో వరికోతలను దృష్టిలో పెట్టుకుని ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గ్రేయిన్ కాలిపర్స్, ఎలక్ట్రానిక్ తూకపు మిషన్లు, మాయిశ్చర్ మీటర్లతో పాటు టార్బాలిన్లు, క్లినర్లు,హస్క్ రిమూవర్ వంటి యంత్రాలను తరలించినట్లు ఆయన వెల్లడించారు.

అందుబాటులో 9.23 కోట్ల గన్ని బ్యాగులు
మొత్తం 17.5 కోట్ల గన్ని బ్యాగులు అవసరం ఉండగా 9.45 కోట్లు కొత్తవి, 8.05 కోట్లు పాతవి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 9.23 కోట్ల గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నట్లు ఆయన చెప్పారు.ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 66.65 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు ఉండగా అందులో 25 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ చేసేందుకు అవకాశం ఉందని మిగిలిన ధాన్యాన్ని నిలువ చేసేందుకు గాను వ్యవసాయ మార్కెట్ కమిటీ,రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన గోదాముల తో పాటు ప్రైవేట్  గోదాములలో ధాన్యాన్ని నిలువ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ముందెన్నడూ లేని రీతిలో సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇస్తుండడంతో లబ్ధి పొందేందుకు సరిహద్దు రాష్ట్రల నుంచి అక్రమంగా తరలించే అవకాశాలు ఉన్నాయని,ఆ ప్రయత్నాలను నిర్ద్వంద్వంగా అడ్డుకుంటామని తెలంగాణ ప్రభుత్వం అందించే బోనస్ తెలంగాణ రైతాంగానికే చేరాలని ఆయన స్పష్టం చేశారు.

అదే సమయంలో అనధికార రవాణా వ్యవస్థను అడ్డుకునేందుకు సరిహద్దు చెక్ పోస్టుల వద్ద సిసి కెమెరాలతో గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం కొనుగోలులో బ్యాంక్ గ్యారెంటీ లతో పాటు ప్రభుత్వం నుంచి ఒప్పందం కలిగిన మిల్లర్లను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. అదే విధంగా సన్నాలను గుర్తించేందుకు వీలుగా కేర్నల్ మెట్రిక్,మైక్రో మీటర్లలతో ఫీల్డ్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చామన్నారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి అమలు పరుస్తున్న సన్న బియ్యం పంపిణీలో 25 శాతం నూకలు ఉండడం భారత ఆహార సంస్థ నిబంధనలలో భాగమే నన్నారు. ఈ విషయంలో విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారం పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఉద్బోధించారు ఫిలిప్పీన్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పటికే లక్ష మెట్రిక్ టన్నుల దాన్యం ఎగుమతి చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే మొదటి దశలో 12,500 మెట్రిక్ టన్నులు పంపించగా రెండో దశలో పంపిణీకి రంగం సిద్ధమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page