జెఈఈ లో సత్తా చాటిన ఎస్సీ గురుకుల విద్యార్థులు

అడ్వాన్స్ కు అర్హత పొందిన 525 మంది
గురుకుల చరిత్రలోనే కొత్త రికార్డు 

హైదరాబాద్, ప్రజాతంత్ర ఏప్రిల్ 19: కార్పొరేట్‌ సంస్థల విద్యార్థుల కంటే తామేమీ తక్కువ కాదని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విద్యార్థులు నిరూపించారు. జేఈఈ మెయిన్స్‌ 2025 లో గురుకులాలకు చెందిన 525 మంది విద్యార్థులు 61 పర్సెంటైల్‌ కంటే అధికంగా మార్కులు సాధించి జెఈఈ మెయిన్స్ లో అర్హత సాధించారు. ఈ ఫలితాలు గురుకుల సంస్థ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా సాధించడం ఒక సువర్ణ అధ్యాయమని గురుకులాల కార్యదర్శి డాక్టర్ అలగు వర్షిణి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ప్రైవేటు కోచింగ్‌ సంస్థలకు దీటుగా తమ విద్యార్థులకు జేఈఈ శిక్షణ ఇస్తున్నామని వర్షిణి తెలిపారు.

జెఈఈ 2025 మెయిన్స్ లో (జనవరి, ఏప్రిల్ లో ) రెండు విడతల్లో 40 విద్యార్థులు 90 ఆ పై పర్సెంటైల్ సాధించగా, 164 మంది విద్యార్థులు  80 ఆ పై పర్సెంటైల్ సాధించారు. ఇందులో గౌలిదొడ్డి బాలుర కళాశాలకు చెందిన ఆర్.మణిదీప్ 99 .03,  కె.చరణ్ తేజ్ 98.30 , రామ్ చరణ్ తేజ 98 .08 , అలాగే బాలికల కళాశాల విద్యార్థినిలు బి.తేజస్విని 98.27, కె.కీర్తన 96.71. షేక్ పేట గురుకులానికి చెందిన టి.అఫ్రయాం 97.87 , నల్గొండ జిల్లా జివిగూడెం కళాశాలకు చెందిన కె .కీర్తన 96.71 పర్సెంటైల్ లను సాధించి ముందు వరుసలో ఉన్నారు.

విద్యార్థులు సాధించిన విజయంతో పేదరికం అడ్డుగోడ కాదని ఆత్మవిశ్వాసంతో గురుకుల విద్యార్థులు నిరూపించారు. ర్యాంకులు సాధించిన వారిలో నిరుపేద దళిత, పారిశుధ్య కార్మికులు, దినసరి కూలీలకు చెందిన …పిల్లలే ఉండడం మరో విశేషం. ఈ సందర్భంగా విజయాలు సాధించిన విద్యార్ధులను , వారి తల్లిదండ్రులను , అందుకు కృషి చేసిన సిబ్బందిని , సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎస్సీడీడీ ప్రిన్సిపాల్సెక్రటరీ ఎన్శ్రీధర్, గురుకులాల కార్యదర్శి డాక్టర్అలుగు వర్షిణి ప్రత్యేకంగా అభినందించారు. అయితే, గురుకుల ప్రతిభ కేంద్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి సంస్థ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలతో మంచి ఫలితాలు సాధించామని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ కార్యదర్శి వర్షిణి తెలిపారు.

ముఖ్యంగా అనుభవజ్ఞులైన ప్రధానాచార్యులను, నిష్ణాతులైన బోధనా సిబ్బందిని నియమించామని  ఆమె పేర్కొన్నారు. అలాగే, మైక్రో – షెడ్యూల్ని పటిష్టంగా అమలు పరచడం, నిరంతర మూల్యాంకనం , ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేయడం , లక్ష్యానికి అనుగుణంగా నిరంతరం పర్యవేక్షణ తోపాటు వారాంతపు, మాక్పరీక్షలు నిర్వహించడం, ఇందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు పరచడం అలాగే ప్రతి విద్యార్థికి అనుగుణంగా కౌన్సిలింగ్ ఇవ్వడం , జె ఈ ఈ మెయిన్స్ పరీక్షలకు ముందు ప్రత్యేక ఆన్లైన్ తరగతులను నిర్వహించి గత ఏడాది ప్రశ్న పత్రాలను వివరించడం , మానసిక ఒత్తిడిని తగ్గించి వారు చదువుపై దృష్టి సారించే విధంగా తగిన తర్ఫీదు ఇవ్వడం మూలాన ఈ ఫలితాలు సాదించేందుకు దోహదపడిందని  గురుకులాల కార్యదర్శి డాక్టర్ అలుగు వర్షిణి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page