మరోసారి హైడ్రా కూల్చివేతలు షురూ..

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19 : గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది.  తాజాగా ఏపీలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ‌కు చెందిన ఫామ్‌ ‌హౌస్‌ ‌ను హైడ్రా అధికారులు శనివారం కూల్చేశారు. కొండాపూర్‌ ‌లోని సర్వే నంబర్‌ 79‌లో ఈ ఫామ్‌ ‌హౌస్‌ ‌ఉంది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఫామ్‌ ‌హౌస్‌ ‌తో పాటు ఆఫీస్‌ ‌నిర్మించినట్లు  అధికారులు తెలిపారు. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌ ‌లో ఉండగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ ‌నిర్మాణాలు చేపట్టారని..సర్వే నెంబర్‌ 79 ‌లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మియాపూర్‌ ‌వరల్డ్ ‌వన్‌ ‌స్కూల్‌ ‌వెనుక ఉన్న అక్రమ నిర్మాణాలను సైతం హైడ్రా నేలమట్టం చేసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య షెడ్లను జెసిబిల సహాయంతో  కూల్చివేసింది.

గతంలో సంబంధిత వ్యాపారులకు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే తుర్కయంజాల్‌ ‌మున్సిపాలిటీ లోని సర్వే నెంబర్‌ 213, 214 ,215 ,216 ‌లో స్కూప్స్ ఐస్‌ ‌క్రీమ్‌ ‌కంపెనీ రోడ్డుకు అడ్డంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. దీంతో శ్రీరంగపురం కాలనీ, సుందరయ్య కాలనీ,  లక్ష్మీనగర్‌ ‌కాలనీ, ఇందిరమ్మ కాలనీల ప్రజలు హైడ్రా అధికారుల పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. రహదారి కబ్జా చేసి చుట్టూ కొంతమంది వ్యక్తులు ప్రహరీ గోడ నిర్మించడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డామని వాపోయారు. అక్రమ కట్టడాలపై ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న నాథుడే లేడని.. కానీ, ముత్యాలమ్మ అనే మహిళ ఒంటరి పోరాటం చేస్తూ హైడ్రాకు ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులు స్పందించి అక్రమ ప్రహరీని కూల్చివేయడం సంతోషంగా ఉందన్నారు. సమస్యను పరిష్కరించిన హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌కి బాధిత కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page