– రైతులకు సాగునీటి సమస్యను తీర్చండి
– మంత్రి ఉత్తమ్కు హరీష్ రావు లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 : తక్షణమే కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటలు సాగు కాక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాల్లో ఉన్న అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపి, సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందాలని, దానికోసం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుంచి మోటర్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ఎల్నినో వల్ల తక్కువ వర్షపాతం, మరోవైపు ప్రాజెక్టుల్లో నీళ్లు లేక రైతులు ఆందోళనలో ఉన్నారు. వానాకాలం పంట సాగుకు సాగునీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా లోయర్ మానేరు డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 6.9 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందన్నారు. మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు నీటిని నింపి ఇంజన్-2లోని ఆయకట్టుకు నీరు అందించి రైతులను ఆదుకోవాలని లేఖలో కోరారు. గత యాసంగి పంటలో కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్ల ఆయకట్టు పరిధిలో 4 లక్షల ఎకరాలు సాగైన విషయం గుర్తించి, ఈ వానాకాలం పంటకు, అదేవిధంగా వచ్చే యాసంగి పంటకు కూడా సాగునీరు అందేలా కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగంలోని అన్ని రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు