- మల్లన్నసాగర్లో 21టిఎంసిల నీళ్లెలా వొచ్చాయి?
- కాంగ్రెస్ మూర్ఖుల్లారా అబద్దాలు ఆపండి
- రైతుల గుండెల్లో కేసీఆర్ పేరు ఎప్పుడూ ఉంటుంది..
- కాళేశ్వరం మునిగింది, కొట్టుకుపోయిందనోళ్లకు మల్లన్నసాగర్లోని జలాలే చెంపపెట్టు
- మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద హరీష్రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ బృందం ప్రత్యేక పూజలు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందనీ, మునిగిపోయిందనీ, లక్ష కోట్ల రూపాయలు వృథా అయ్యాయనీ నిండుగా ఉన్న గోదావరి జలాలు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్న మాటలన్నీ అబద్దాలేనని, కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోతే మల్లన్నసాగర్కు 21టిఎంసిల నీళ్లు ఎలా వొచ్చాయనీ మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ప్రశ్నించారు. శుక్రవారం మాజీమంత్రి తన్నీరు హరీష్రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతల బృందం సిద్ధిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లంపల్లి నుంచి లక్ష్మీబారేజ్, అన్నపూర్ణ రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ నుండి కొండపోచమ్మ ప్రాజెక్టు వరకు గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాలేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా? అని కాంగ్రెస్ నేతలను అడిగారు. మల్లన్నసాగర్ నిండు కుండలా ఉందంటే కాళేశ్వరం లో అంతర్భాగం కాదా? అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద పండే పంట మీద కేసీఆర్ పేరు, ప్రతి రైతు గుండెల్లో కేసీఆర్ పేరు నిలబడి ఉంటుందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయిందని కాంగ్రెస్ నేతలు మూర్ఖపు మాటలు మానుకోవాలని హితవు పలికారు. గోదావరి జలాలు వొస్తున్నాయంటే కాళేశ్వరం లో అంతర్భాగం కాదా? కేసీఆర్ కట్టించిన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ కాళేశ్వరం లో అంతర్భాగం కాదా? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు ఇప్పటికీ దుష్ప్రచారం చేస్తున్నారనీ, కాంగ్రెస్ పార్టీది అంతా డైవర్షన్ పాలిటిక్స్ అని మండిపడ్డారు. కాంగ్రెస్ది డైవర్షన్ పాలిటిక్స్ అయితే, బిఆర్ఎస్ పార్టీది రైతులకు నీళ్లు ఇవ్వాలనే తపన, వాటర్ డైవర్షన్ అన్నారు. అటెన్షన్ చేసే డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ చేస్తుందన్నారు. కాళేశ్వరం కొట్టుకుపోయిందని మాట్లాడే కాంగ్రెస్ మూర్ఖులకు 21టిఎంసిలో నిండు కుండలా సముద్రంలా ఉన్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు సజీవ సాక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాజెక్టు కట్టేటప్పుడు అడుగడుగునా అడ్డుపడ్డారనీ, ఇప్పుడు వొస్తే కూడా అడ్డుకుంటున్నారన్నారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుకు వొచ్చి ఇంత కుంకుమ, పసుపు వేసి కొబ్బరికాయ కొట్టి నీళ్లు చల్లుకోవాలన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సిద్ధిపేట చుట్టు పక్కల ఉన్న జిల్లాలకు సాగుకు ఎంతో ఉపయోగమన్నారు. నిండుకుండలా ఉన్న మల్లన్నసాగర్ను చూసి కడుపునిండిందన్నారు కాళేశ్వరం మునిగింది, కొట్టుకుపోయిందని వాళ్లకి మల్లన్నసాగర్లోని జలాలే చెంపపెట్టు లాంటి సమాధానం అన్నారు. కాలేశ్వరం డిజైనింగ్ సరిగ్గా లేదని, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందనీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారనీ, కాంగ్రెస్ నేతలు కాలేశ్వరం ప్రాజెక్టుపై అసత్యపు ఆరోపణలు చేశారన్నారు.
కాలేశ్వరం కొట్టుకపోయిందని అబద్దాలు ప్రచారం చేశారనీ, నిజంగా కాలేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోతే మల్లన్నసాగర్లోకి 21టిఎంసిల నీళ్లు ఎట్లా వొచ్చాయన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు వాకిటి సునీతా )క్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, పరపతి వెంకట్రామరెడ్డి, దేశపతి శ్రీనివాస్, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్లు వంటేరు ప్రతాప్రెడ్డి, దేవి ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోమటిరెడ్డి వెంకట్నర్సింహారెడ్డి(కేవీఎన్ఆర్)తో పాటు దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.