సోలార్ ఎనర్జీ నిల్వలు.. సింగరేణికి సిరులు

– మిగులు విద్యుత్తుకు విలువ తెచ్చిన సింగరేణి
– మిగులు విద్యుత్తును నిల్వ చేస్తున్న బీఈఎస్ఎస్
– రాష్ట్రంలోనే తొలి అతిపెద్ద ప్రాజెక్టు సింగరేణిలో ఏర్పాటు
– బీఈఎస్ఎస్ తో రూ.26 లక్షల ఆదా

రామగుండం, ప్రజాతంత్ర, మే 21 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా సింగరేణిలో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బీఈఎస్ఎస్) సత్ఫలితాన్ని ఇస్తోంది. పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్ విద్యుత్తులో వినియోగం కాని విద్యుత్తును ఉచితంగా గ్రిడ్‌కు సరఫరా చేయకుండా బ్యాటరీలో నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడుకునే అవకాశం కలిగించే ఈ వ్యవస్థ సింగరేణికి ఆర్థిక లబ్ది చేకూరుస్తోంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు నాలుగు నెలల క్రితం మందమర్రి ఏరియాలోని 28 మెగావాట్ల సింగరేణి సోలార్ ప్లాంట్‌కు అనుబంధంగా ఒక మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ నెలకొల్పారు. ఇందు కోసం రూ.2.5 కోట్లను యాజమాన్యం వెచ్చించింది.

బీఈఎస్ఎస్ ఉపయోగం ఏమిటి?

రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తుకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని సింగరేణి సహా పలు రాష్ట్ర సంస్థలు సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. సింగరేణి సంస్థ ఇప్పటికే ఎనిమిదిచోట్ల 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వీటిలో 147 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఓపెన్ యాక్సెస్ ప్లాంట్లు కాగా తెలంగాణ విద్యుత్తు గ్రిడ్‌లకు అనుసంధానం చేసింది. మిగిలిన 98.50 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఇన్‌హౌజ్ ప్లాంట్ల విద్యుత్తును కూడా విద్యుత్ శాఖ గ్రిడ్లకు అనుసంధానం చేసినప్పటికీ విద్యుత్ ఒప్పందం ప్రకారం ఇక్కడ స్థానిక అవసరాలకు వాడగా మిగిలిన విద్యుత్తుకు మాత్రం తెలంగాణ డిస్కం ఎలాంటి చెల్లింపులు జరపదు. మిగులు విద్యుత్తును ఉచితంగానే గ్రిడ్‌కు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇన్ హౌస్ ప్లాంట్ల నుండి రోజుకు వేలాది యూనిట్ల మిగులు విద్యుత్తు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేకుండా గ్రిడ్‌కు సింగరేణి సరఫరా చేస్తోంది. అయితే ఈ మిగులు విద్యుత్తును కూడా సొమ్ము చేసుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు సింగరేణి సంస్థ రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక మెగావాట్ సామర్థ్యం గల  బీఈఎస్ఎస్  ను మందమర్రి ప్లాంట్‌లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. మందమర్రిలో గల 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్ సమర్థంగా పనిచేస్తూ మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలలోని గనులకు, కాలనీలకు అవసరమైన విద్యుత్తును అందిస్తోంది. అయితే స్థానిక విద్యుత్తు అవసరాలకు సరిపోగా ఇంకా కొంత విద్యుత్తు మిగిలిపోతున్నది. ఈ నేపథ్యంలో మందమర్రి ప్లాంటులో జనవరిలో ఏర్పాటు చేసిన  బీఈఎస్ఎస్ యూనిట్ స్థానిక అవసరాలకు వినియోగించగా ఇంకా మిగిలిన 3,35,485 యూనిట్ల విద్యుత్తును నిల్వ చేసుకుని అవసరమైన సందర్భంలో వినియోగించుకుంది. తద్వారా సింగరేణి సంస్థకు రూ.25,66,460 ఆర్థిక లబ్ధి చేకూరింది. ఒక మెగావాట్ సామర్థ్యం గల బీఈఎస్ఎస్ యూనిట్ ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్తును ఆదా చేయడం విశేషం. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన బీఈఎసఎస్ విజయవంతం అవడంపై సింగరేణి యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మరిన్ని ప్రాజెక్టులను చేపట్టేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు యాజమాన్యం ప్రకటించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *