సాగర్ ఆయకట్టు రైతన్నకు సీతారామ భరోసా

– ఎగువ వరదను ఒడిసిపట్టి వైరాకు తరలింపు
– రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా గోదావరి జలాలు..
– మంత్రి తుమ్మల ఆదేశాలతో షురూవైరా/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 8 : గోదావరి పరీవాహక ప్రాంతంలో, ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏటా ఇలా వృథాగా సముద్రం పాలయ్యే గోదావరి జలాలను ఈసారి సద్వినియోగం చేసుకుని, ఆయకట్టు రైతులకు సాగునీటి భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా అడుగులు వేసింది. సీతారామ ఎత్తిపోతల పథకం మోటార్లను తక్షణమే ఆన్‌ చేసి, రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా గోదావరి నీటిని వైరా రిజర్వాయర్‌కు తరలించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగిన అధికారులు బుధవారం  ఉదయం బిజ్జి కొత్తూరు వద్ద మోటార్లను ఆన్‌ చేసి, గోదావరి జలాల తరలింపు ప్రక్రియను షురూ చేశారు.

వెనక్కు మళ్లిన నీళ్లు.. 13 కి.మీ. పయనం

సాధారణంగా సాగర్‌ మెయిన్‌ బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా ఆయకట్టుకు ముందుకు సాగాల్సిన గోదావరి జలాలను, ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఓ వినూత్న పద్ధతిలో వెనక్కు మళ్లించే ఏర్పాట్లు చేశారు. సీతారామ మోటార్ల ద్వారా కాలువలోకి చేరిన నీటిని ఏకంగా 13 కిలోమీటర్ల దూరం వెనుకవైపు నడిపించి, అక్కడి నుంచి ఎస్కేప్‌ లాకుల ద్వారా వైరా రిజర్వాయర్‌లోకి మళ్లించనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఈ సాంకేతిక ప్రక్రియ ద్వారా తరలుతున్న గోదావరి జలాలు  గురువారం మధ్యాహ్నానికల్లా వైరా రిజర్వాయర్‌ను చేరనున్నాయని, దీంతో రిజర్వాయర్‌ నీటి నిల్వ గణనీయంగా మెరుగుపడుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

వరద జలాల సద్వినియోగం

ఏటా వర్షాకాలంలో గోదావరిలో వచ్చే వరద జలాల్లో గణనీయ భాగం ఎలాంటి వినియోగం లేకుండా సముద్రంలో కలిసిపోతుండటం ఆనవాయితీ. ఈ ధోరణికి భిన్నంగా, సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి సామర్థ్యంతో వినియోగించుకుని, లభ్యమయ్యే ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ కృషిలో భాగంగానే వరద ఉధృతి పెరిగిన వెంటనే మోటార్లను ఆన్‌ చేసి, ఆ జలాలను అవసరమైన రిజర్వాయర్లకు తరలించే కార్యాచరణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.

సాగర్‌, వైరా ఆయకట్టుకు దీర్ఘకాలిక ప్రయోజనం

సీతారామ ప్రాజెక్టు ద్వారా జరుగుతున్న ఈ నీటి తరలింపు కేవలం తాత్కాలిక చర్య మాత్రమే కాదని, సాగర్‌ ఆయకట్టుతో పాటు వైరా పరిధిలోని రైతాంగానికి దీర్ఘకాలికంగా సాగునీటి భద్రత చేకూర్చే ప్రయత్నంగా అధికారులు అభివర్ణిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు కూడా ఆయకట్టుకు నీటి ఎద్దడి రాకుండా ఇలాంటి ముందస్తు నిల్వ చర్యలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటున్నారు. వైరా రిజర్వాయర్‌ నీటి మట్టం పెరగడం వల్ల ఆ పరిధిలోని పలు గ్రామాల్లో తాగు, సాగునీటి అవసరాలకు ఢోకా ఉండదని అధికార వర్గాలు తెలిపాయి.

మంత్రి తుమ్మల పర్యవేక్షణ

గోదావరిలో వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన సందర్భాల్లో తక్షణ నిర్ణయాలు తీసుకుంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఈ తరలింపు ప్రక్రియను కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, ప్రతి అవకాశాన్నీ ఆయకట్టు ప్రయోజనం కోసం వినియోగించుకోవాలన్న దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *