– మహిళలను కించపరిచేలా వ్యాఖ్యల వ్యవహారంలో
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సీనియర్ నేత షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్గా స్పందించింది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చిన ఆడియో క్లిప్ వైరల్ కావడంతో పార్టీ హై కమాండ్ చర్యలకు దిగింది. ఈ వైరల్ అయిన ఆడియోలో షబ్బీర్ అలీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంపై వివరణ ఇవ్వాలని హుకుం జారీ చేసింది. పార్టీ అంతర్గత వ్యవహారాలను పబ్లిక్లో చర్చకు తీసుకురావడంపై కూడా ఏఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు.. కామారెడ్డి కాంగ్రెస్లో వర్గపోరు మరింత ముదురుతున్నట్లు తెలుస్తోంది. షబ్బీర్ అలీ వర్గం, చంద్రశేఖర్ రెడ్డి వర్గం మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో సొంత పార్టీ నేతలపై విమర్శలు, దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పరిణామాలతో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. పార్టీ క్రమశిక్షణ చర్యలు, వర్గపోరు, పరస్పర ఆరోపణలతో స్థానిక కాంగ్రెస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.