– బయటకు వచ్చేందుకు బెంబేలెత్తుతున్న ప్రజలు
న్యూదిల్లీ, మే 23: దేశవ్యాప్తంగా భానుడి భగభగలు తీవ్ర రూపం దాల్చాయి. ఉత్తర భారత దేశం నుండి దక్షిణ భారత దేశం వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదికల ప్రకారం,దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత, వడగాల్పులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. కొద్దిరోజులుగా దేశంలో చాలా ప్రాంతాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టాలంటే భయంతో వణికిపోతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్లకే పరిమితం అవుతున్నారు. రానున్న వారం రోజులపాటు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా వాయువ్య, మధ్య, తూర్పు భారత్లోని పలు మైదాన ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, దిల్లీ, రాజస్థాన్లలోని పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. విదర్భ, ఆంధ్రాలోని తీరప్రాంతం, యానాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లలోనూ వడగాలులు వీచే అవకాశముందని తెలిపింది. శుక్రవారం ఉదయం దాదాపు 11 గంటల సమయానికి నమోదైన ఉష్ణోగ్రతల ప్రకారం ప్రపంచంలోనే 50 అత్యంత వేడి నగరాలన్నీ భారత్లోనే ఉన్నాయి. ఎయిర్క్వాలిటీ ఇండెక్స్ ఈ గణాంకాలను వెల్లడించింది. జాబితాలోని సగం నగరాలు ఉత్తరప్రదేశ్లోనివే కావడం గమనార్హం. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలూ ఇందులో ఉన్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





