– ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలనడం అమానుషం
– నిద్ర నటిస్తున్న వారిని లేపలేం
– రేవంత్ పరిస్థితి అదే
– కాళేశ్వరంపై డైవర్షన్ డ్రామాలు
– మాజీ మంత్రి హరీష్రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11: రైతులు నీళ్లు అడిగితే, రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు ఇవ్వమని చెప్పితే.. ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలి అనడం, బెల్టుతో కొట్టాలని మాట్లాడటం ఆయన శాడిస్టిక్ మనస్తత్వానికి నిదర్శనం. ఇలాంటి దారుణమైన మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఆరు హత్యలు చేసిన షాబాద్ దైవాలగూడ హంతకుడికి తేడా ఏమీ లేదనిపిస్తోంది. ఇంతటి నీచమైన, హింసాత్మకమైన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేసినందుకు రాష్ట్ర ప్రజలకు, రైతులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎప్పుడెప్పుడు ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, చేతగానితనం ప్రజల ముందుకు వస్తాయో.. అప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి డైవర్షన్ డ్రామాలు తెరపైకి రావడం పరిపాటిగా మారింది. ఒక పోక్సో నిందితుడికి కనీసం పదేళ్ల జైలు శిక్ష పడేలా కఠినమైన సెక్షన్లు నమోదు చేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. పోలీసుల నిర్లక్ష్యంతో బెయిల్పై బయటకు వచ్చిన ఆ మానవ మృగం.. ఓ మైనర్ అమ్మాయిపై ఘాతుకానికి ఒడిగట్టి, ఆమె తల్లిని, నాయనమ్మను, ముగ్గురు పసిపిల్లలను అత్యంత కిరాతకంగా చంపి నరమేధం సృష్టించాడు. ఇంతటి ఘోరాలకు పాల్పడిన ఆ హంతకుడు స్వేచ్ఛగా తిరుగుతున్నా ఇప్పటికీ పట్టుకోలేకపోవడం హోంశాఖ చేతగానితనానికి పరాకాష్ట. ఈ శాంతిభద్రతల వైఫల్యం నుండి, ప్రజల తీవ్ర ఆగ్రహం నుండి తప్పించుకోవడానికే రేవంత్ సర్కార్ మళ్లీ అదే కాళేశ్వరం, మేడిగడ్డ, ఎన్ ఎస్డీఏ పాట పాడుతున్నాడు. “కొంతమందిని ఎల్లప్పుడూ మోసం చేయవచ్చు, అందరినీ కొంతకాలం మోసం చేయవచ్చు.. కానీ, అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు” అన్న అబ్రహం లింకన్ మాటలు రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతాయి. ‘ఇసుక నుంచి నూనె తీయవచ్చు, ఎండమావిలో నీరు తాగవచ్చు.. తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు.. కానీ మూర్ఖుడి మనసు మార్చలేము’ అన్నట్లుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు. కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడానికి, గోదావరి జలాలను ఎత్తిపోసి పంటలను కాపాడాలని, రిటైర్డ్ ఇంజనీర్లు, బీఆర్ఎస్ తపన పడుతుంటే.. సీఎం మాత్రం తన క్షుద్ర రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, రైతుల పొలాలను ఎండబెడుతున్నారు. నిద్రపోయే వాడిని లేపవచ్చు కానీ, నిద్ర నటిస్తున్న వాడిని లేపలేము. రైతులకు సాగునీరు ఇవ్వాలనే కనీస ఆలోచన, తపన రేవంత్ రెడ్డికి ఏమాత్రం లేదని ఈరోజు మీడియా సమావేశంతో స్పష్టంగా తేలిపోయింది. నీళ్లు అడిగితే రక్తం చల్లాలన్న ఈ అహంకారపు, దుర్మార్గపు వైఖరిని తెలంగాణ రైతాంగం గమనిస్తుంది. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి ఆడుతున్న ఈ డైవర్షన్ నాటకాలను ప్రజలు అర్థం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ చేతకాని ప్రభుత్వానికి, తెలంగాణ రైతులు, ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయం అని హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





