ఈ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : భూమి అంటే ఆదాయాన్ని ఇచ్చే వనరే కాదు.. అది సమాజంలో ఆత్మ గౌరవాన్ని ఇచ్చేదని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్ లోని అంబేద్కర్ భవనంలో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సభాపతి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. భూ భారతి చట్టంతో రైతులతో పాటుగా భూములను కొనుగోలు చేసే వారందరికీ మేలు జరుగుతుందన్నారు. కొత్త చట్టం ద్వారా వారసత్వ, ప్రభుత్వ, అటవీ, సాగునీటి శాఖ, అసైన్డ్ భూమి, దేవాదాయ శాఖ భూమూల అనేది స్పష్టంగా తెలుస్తుందని స్పీకర్ తెలిపారు. భూములు కొనుగోలు చేసే వారు మోసపోకుండా జాగ్రత్తగా ఉంటారని అన్నారు. రైతులకు మేలు చేసేలా క్షేత్ర స్థాయిలో అందరి అభిప్రాయాలను తీసుకుని పకడ్బందీగా భూ భారతి చట్టాన్ని రూపొందించాలని స్పీకర్ సూచించారు.
ప్రజా ప్రభుత్వానికి ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి మంచి ప్రయత్నం లేదు. వ్యాపారస్తులు, దళారులకు కొమ్ముకాసే విధంగా నలుగురు పెద్దలు ఏసీ రూమ్ లో కూర్చోని ధరణి అనే భూతాన్ని రూపొందించాలని అన్నారు. వేలాది ఎకరాల దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల భూములను లాక్కున్నారని, ధరణితో సమస్యలు పెరిగాయని, ఎక్కడ చూసినా చిక్కుముడులతో కూడుకుందని అన్నారు. ధరణి కారణంగా ఎంతోమంది రైతులు, కొనుగోలు చేసిన మద్య తరగతి ప్రజలు ఆత్మహత్యలు చేసుకొని దుస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. ధరణి లో ఉన్న లోపాలను గుర్తించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తానని హామీ ఇచ్చి, అన్న మాటకు కట్టుబడి మాటను నిలబెట్టుకుని ఇప్పుడు రైతుల మేలు కోసం భూ భారతిని తెచ్చారని తెలిపారు. రైతు బిడ్డకు మాత్రమే రైతుల కష్టాలు రైతు బిడ్డకు మాత్రమే తెలుస్తుందని ఆయన అన్నారు. భూ భారతి అమలుతో రైతులతో పాటు భూమి ఉన్న వారందరికీ మేలు జరుగుతుందని, భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పీకర్ తెలిపారు.
భూమికి సంబంధించిన సమస్త సమాచారం అందుబాటులో ఉంటుందని భూముల అమ్మకాలు, కొనుగోలు సులభంగా జరుగుతాయని తెలిపారు. అమాయకులైన రైతులు మోసపోకుండా భూ భారతి అండగా ఉంటుందని, భూ భారతితో మీ భూములకు వంద శాతం భద్రత ఉంటుందని ఆయన అన్నారు. సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు భూ భారతితో పరిష్కారమవుతాయని, మీ భూముల సమస్యల పరిష్కారానికి ఎవ్వరి దగ్గర పైరవీలకు పోవాల్సిన అవసరం లేదని ఆయన రైతులకు సూచించారు. భూ భారతి పోర్టల్ లో అన్ని రకాల ఆప్షన్లు ఉన్నాయని, సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధంగా సరళంగా డిజైన్ చేయడం జరిగిందని, రెవెన్యూ అధికారులు మీకు అందుబాటులో ఉంటూ సహాయం చేస్తారన్నారు . రెవెన్యూ ఆధికారులను కోరేది ఒక్కటే క్షేత్ర స్థాయిలో విచారణ చేసి అసలైన పట్టాదారులకే పట్టా పాస్ పుస్తకాలను ఇవ్వాలని సూచించారు. అన్నదాతల మేలు కోసం తెచ్చిన భూ భారతి చట్టాన్ని అధికారులు సక్రమంగా అమలు చేయాలని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలో రైతుల కోసం 54 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని, దేశ చరిత్రలో మొదటి సారిగా 25 లక్షల మంది రైతులకు 21వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందని స్పీకర్ తెలిపారు. సన్న రకం వడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నారని ఆయన అన్నారు.
సన్న బియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా 2 వేల 858 కోట్లు భారం పడినా పేదలు కడుపునిండా అన్నం తింటారనే మానవత్వంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ మాట్లాడుతూ… ప్రజలు ఎలాంటి భూ సమస్యలు ఉన్నప్పటికీ కోర్టులను ఆశ్రయించకుండా సమస్యలు పరిష్కరించే వెసులుబాటును భూభారతి చట్టం తీసుకు వచ్చిందని అన్నారు. భూ సమస్యల సత్వర పరిష్కారానికి ఈ చట్టం ఎంతగానో దోదపడుతుందని ఆయన అన్నారు. రిజిస్ట్రేషన్, సాదా బైనమా, సీలింగ్, అసైన్మెంట్ , వారసత్వ భూముల పరిష్కారం తో పాటు మార్పులు చేసుకునే అవకాశం భూ భారతి లో ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, డిసిఎంఎస్ డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీ నారాయణ, నాయకులు, రైతులు పాల్గొన్నారు.