గౌరవనీయులయిన కేసీఆర్, కేటీర్, హరీష్ రావు గారికి…
మార్చి 2026 వరకల్లా మావోయిస్టులను అంతం చేస్తామని ముహూర్తం డిసైడ్ చేసి మరీ బీజేపీ సర్కారు మధ్య భారతదేశంలో మారణకాండను కొనసాగిస్తున్న విషయం మీకు తెలిసిందే. మావోయిస్టు పార్టీతో సహా అక్కడి అమాయక ఆదివాసుల హత్యలు కూడా ప్రతీ రోజూ వార్తాపత్రికల్లో, మీడియాలో మీరు వింటూనే ఉండి ఉంటారు. ఆపరేషన్ కగార్ పేరుతొ గత ఏడాదిన్నర కాలంలో వందలాది భారతదేశ ముద్దుబిడ్డలను, అమాయక ఆదివాసీలను ఎన్కౌంటర్ల పేరుతొ బీజేపీ సర్కారు హత్య చేసింది. ఇటీవల జరిగిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో హత్య దాకా అనేక తెలంగాణ బిడ్డలు కూడా కేంద్ర బలగాల చేత హత్యగావించబడ్డారు.
సమసమాజ స్థాపనే లక్ష్యంగా పని చేస్తున్న మావోయిస్టు పార్టీ తెలంగాణ ప్రాంతంలో సామజిక-ఆర్ధిక-రాజకీయ రంగాల్లో ప్రజల స్థితిగతులను ఎంతగా మార్చివేసిందో ఎన్ని గొప్ప విజయాలు సాధించిందో మీకు తెలుసు. అదే క్రమంలో “నక్సలైట్ల అజెండాయే మా అజెండా” అని ప్రకటించారు కూడా. “పౌర హక్కుల సంఘానికి అవసరమయితే నేనే అధ్యక్షుడిగా ఉంటాను” అని మీరు అన్న మాటలు కూడా పౌరసమాజం గుర్తు పెట్టుకుంది. ఎన్ కౌంటర్ లు లేని తెలంగాణ నిర్మిస్తామని మీరు ప్రజలకు వాగ్దానం చేశారు కూడా. 2004 శాంతి చర్చల సమయంలో జనశక్తి నేత కామ్రేడ్ రియాజ్ మరియు ఇతరులను పోలీసులు భూటకపు ఎన్కౌంటర్లలో చంపివేస్తే దానికి నిరసిస్తూ మంత్రి వర్గం నుండి కూడా మీరు బయటికి వచ్చిన సంగతి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇది శాంతి-భద్రతల సమస్య కాదు, సామాజిక సమస్యగా చూడాలని కూడా మీరు అనేకసార్లు మీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను మీరు 27వ తారీఖున నిర్వహిస్తున్నారు. ఆ సభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మారణకాండను వెంటనే నిలిపివేయాలని మీరు డిమాండ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతో పాటుగా మావోయిస్టు పార్టీతో వెంటనే బేషరతుగా చర్చలు జరపాలని, కర్రెగుట్టలో మోహరించిన తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వెనక్కి పిలవాలని డిమాండ్ చేయడంతో పాటు దండకారణ్యంలో మోహరించిన ప్రభుత్వ బలగాలను వెంటనే వెనక్కి రప్పించాలని సభాముఖంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండు చేయాలని విజ్ఞప్తి. మీరు మాట్లాడే ఈ మాటలు దేశవ్యాప్తంగా ఇతర రాజకీయ నాయకులకు స్ఫూర్తినివ్వడమే కాకుండా బీజేపీ సర్కారు పైన తీవ్రమయిన ఒత్తిడి తీసుకురాగలుగుతారు. బీఆర్ఎస్ పార్టీలోని ప్రధాన నాయకత్వం, క్యాడర్ దాదాపుగా విప్లవ పార్టీల సానుభూతిపరులే కావడం, తెలంగాణ సమాజానికి అన్నలంటే ప్రేమ ఉండడం వలన మీరు మాట్లాడే ఈ మాటలు వారిలో మీ పైన గౌరవాన్ని మరింతగా పెంచుతాయి.
కేంద్ర ప్రభుత్వ మారణకాండ పైన, శాంతి చర్చల పైన మీరు రజతోత్సవ సభలో మాట్లాడుతారని ఆశిస్తూ…