రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన రావడంతో ఈనెల 7వ తేదీ నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar) కార్యాలయాల్లో అమలు చేయబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత నెల 10వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేశామని 30వ తేదీ నాటికి 22 కార్యాలయాల్లో సగటున 866 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ (Registrations) చేశామని తెలిపారు. గురువారం సచివాలయంలోని తమ కార్యాలయంలో స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ విభాగంపై సుదీర్ఘంగా మంత్రి పొంగులేటి సమీక్షించారు.
రెండో దశలో రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్ నగర్, షాద్నగర్, మహేశ్వరం, వనస్ధలిపురం, షేర్ లింగంపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఉప్పల్, ఘట్కేసర్, నారప్పల్లి, మల్కాజ్గిరి, జనగాం, ఘన్పూర్, నర్సంపేట, బీబీనగర్, అదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల,పెద్దపల్లి, కల్వకుర్తి , వనపర్తి, గద్వాల్, గజ్వేల్ మెదక్ జిల్లాలో సిద్దిపేట అర్భన్ & రూరల్, రంగారెడ్డి వరంగల్ హైదరాబాద్, హైదరాబాద్ సౌత్ రిజిస్ట్రార్ ఆఫీస్లలో అమలు చేస్తామని తెలిపారు.
22 కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానంలో వచ్చిన ఫీడ్బ్యాక్ను అధికారులను అడిగి తెలుసుకున్నారు స్లాట్ బుకింగ్ విధానం అమలు అవుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి పోస్ట్ కార్డుద్వారా అభిప్రాయాలను సేకరించగా 94 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు మంత్రికి వివరించారు. పోస్టు కార్డులో ఉన్న ఫోన్ నెంబర్తో చంపాపేట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విష్ణుగౌడ్ అనే వ్యక్తితో మంత్రి స్వయంగా ఫోన్లో మాట్లాడి స్పందన తెలుసుకున్నారు. స్లాట్ బుకింగ్కు అవసరమైన ఇంటర్నెట్ స్పీడ్ను పెంచుకోవాలని సూచించారు. వొచ్చే నెల 3వ వారం నాటికి రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయడానికి ఆధార్ -ఈ సంతకం ప్రవేశపెడుతున్నామని వీలైనంత త్వరితగతిన అమలులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.
అధికారుల పాత్ర ప్రశంసనీయం
స్లాట్బుకింగ్ విధానం విజయవంతం కావడంలో అధికారుల పాత్ర ప్రశంసనీయమని, ఇందుకు కృషి చేసిన అధికారులందరికీ మంత్రి పొంగులేటి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పనిచేసి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ మంచిపేరు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అధికారులు ఏ పనిచేసినా ప్రజలు సంతృప్తి చెందేలా సేవలందించడమే లక్ష్యంగా ఉండాలని అభిలషించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, స్టాంప్స్& రిజిస్ట్రేషన్ ఐజీ జ్యోతి బుద్దప్రకాష్, సిసిఎల్ఎ సెక్రటరీ మకరంద్, మీసేవ డైరెక్టర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.