రామాను జాచార్యుల జయంతి సందర్భంగా
రాజాదరణ పొంది ప్రాబల్యాన్ని సంతరించుకున్న జైన, బౌద్ధ, శైవ మతాలు స్థానిక ఆచార వ్యవహారాలలో కలసి, అనేకానేక శాఖలుగా విభజితాలై, వేర్వేరు సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ తమ శాఖలు గొప్పవని నొక్కి చెబుతూ, మూల ఉపనిషత్తుల సారాన్ని ప్రజలకు చేరువ చేయజాలని సమ యాన, విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించి ఉద్దరించారు శ్రీ రామాను జాచా ర్యులు. త్రిమతా చార్యులలో, ద్వితీ యులైనా, కర్తవ్య నిర్వహణలో అద్వితీయులు. అసమాన ధైర్యాన్ని ప్రదర్శించి, సాటిలేని భక్తి తత్పరు నిగా తత్వవేత్తగా, ఆస్తిక హేతువాదిగా, పరమ యోగిగా, శంకర భగవత్పాదుల అద్వైత సిద్ధాంతం లోని దోషాలను సరిదిద్ది, నాటికి ప్రబల ప్రచారంలో ఉన్న సంప్రదాయాలన్నీ, దేవుడిని కొలవడానికి భిన్న మార్గాలే కాని, వైదిక మతానికి బదులుగా పాటించాల్సినవి కానే కాదని నొక్కి చెప్పిన ధీశాలి ఆయన. రామానుజులు జన్మించేనాటికి చోళులు, శైవ మతానుయాయులు అయినప్పటికీ, వైదిక మతాలను వ్యతిరేకించ లేదు. చాళుక్యులు శైవ మతస్తులు అయి ఉండి, తర్వాత జైన మతాన్ని ఆలపించారు. ృయసల రాజులు, జైన, వీరశైవ మతాలను ఆదరించారు. మౌర్యుల కాలానికి బౌద్ధం క్షీణ దశకు చేరుకుంది. మద్రాసుకు 30 మైళ్ళ దూరాన గల, శ్రీపెరుంబుదూరులో, హరిత గోత్రోధ్భవులు, ఆపస్తంభ సూత్ర, యజుర్వేద శాఖాధ్యాయులు, శ్రీమాన్ అసూరి సర్వ క్రతు కేశవ సోమయాజి దీక్షితార్ మరియు కాంతిమతి దంపతులకు కలియుగ సంవత్సరం 4118 క్రీస్తు శకం1017 వైశాఖ శుక్ల పక్ష షష్టి గురువారం జనన మొందారు. కేశవ తన కుమారునికి, ప్రాథమిక విద్య స్వయంగా నేర్పగా, అనంతరం కాంచీపురానికి వెళ్లి యాదవ ప్రకాశుల వద్ద వేదాంతం అభ్యసించి, మూలానికి వ్యాఖ్యానం చేయడంలో గురు – శిష్యులకు భేదాభిప్రాయాలు కలువగా తమ విశిష్టాద్వైతాన్ని నెగ్గించుకున్నారు రామానుజులు.
దీనితో గురువు కాశీకి కలసి తమతో పయనమైన, శిష్యుడిని చంపించే కుట్ర చేయగా, అది తెలుసుకుని, తప్పించుకొని కంచికి చేరారు. శ్రీరంగంలోని వైష్ణవ గురువైన అలవందారు, రామానుజుని ప్రతిభ గురించి విని శిష్యుడైన, పెరియ నంబిని పంపగా, వెనువెంటనే ఆయన పయనమయ్యారు. రామానుజుడు, శ్రీరంగం చేరే సమయానికి, ఆలవందారు తుది శ్వాస వదిలారు. భౌతిక దేహ వేళ్లలో, 3 విచిత్రంగా ముడుచుకొని ఉండడాన్ని గమనించారు. ఆయన మూడు కోరికలు తీరకుండా ఉండిపోయారని, అలవండారు శిష్యుల ద్వారా విని, మూడు కోరికలు అయిన, బ్రహ్మసూత్రాలకు, సహస్ర నామాలకు, తరువాయి మొళికి వ్యాఖ్యానాలు రాస్తామని, వాగ్దానం చేయడంతో మూడు వేళ్ళు తెరుచుకున్నాయని చెబుతారు. తర్వాత మధురాంతకంలో పెరియ నంబికి శిష్యులుగా మారారు.
విద్యాభ్యాస సమయాన, తన భార్య గయ్యాలి తనం కారణంగా, గురువు శ్రీరంగం వెళ్లనందుకు నొచ్చుకున్న రామానుజులు, సంసార బంధం వీడి, సన్యాసాశ్రమం స్వీకరించారు. తిరు కోటి యార్ నంబి ప్రఖ్యాతి విని, తనను శిష్యునిగా స్వీకరించమని, ఆరు మార్లు ప్రాధేయ పడినా, ఫలితం లేక పోగా, ఏడవ సారి చేర బిలిచి, మంత్ర రహస్యం ఎవరికీ చెప్ప కూడదని వాగ్దానాన్ని పొంది, ఉపదేశం చేశారు. మోక్ష సంపాదనకు ఆ మంత్ర శక్తి సాధనం లేదని భావించి, ఒక వైష్ణవాలయం గోపురం ఎక్కి, గురువుకు చేసిన ప్రమాణాన్ని పక్కన పెట్టి, ఉపదే దేశిత మంత్రాన్ని, బహిరంగంగా ఎలుగెత్తి ప్రకటించారు. గురువు కోపంతో నరకానికి వెళతావు అని అన్నప్పుడు, జన సమూహానికి మోక్షం లభిస్తే, తాను ఒక్కడు నరకానికి వెళ్ళడానికి సిద్ధమని బదులు ఇచ్చారాయన. శిష్యుని ఉన్నత ఆదర్శానికీ, సంతోషించి, గురువు ఆశీర్వదించారు. అద్వైత వేదాంతి యగు, యజ్ఞమూర్తితో, శ్రీరంగంలో 16 రోజులు వాదించి, ఓడించగా, ఆయన శైవం పుచ్చుకున్నారు. బ్రహ్మసూత్రాలకు భాష్యం, వేదాంత సారం, వేదాంత దీపం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, మొదలైన రచనలు చేశారు. తిరుపతి దేవస్థానంలో పూజాదికాలపై, తగాదా రాగా రామానుజులు మధ్యవర్తిగా ఉండి, వైష్ణవ ప్రాబల్యానికి కట్టుదిట్టం చేశారు. చేసిన వాగ్దానం ప్రకారం బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానాలు రాయగా, పరాశర బట్టు చేత సహస్ర నామాలకు, తమ చుట్టమైన తిరుక్కురైప్పిరన్ చేత తిరువాయి మొలి మీద వ్యాఖ్యానాలు రాయించారు. కావేరీ తీర సాలిగ్రామం అనే చోట 12ఏళ్లు నివసించి, జైనులను ఓడించి, బిత్తి దేవుని వైష్ణవునిగా మార్చారు. చాత్తాద శ్రీవైష్ణవులు అమ్మంగార్ల కైంకర్యం చేసే సంప్రదాయాలను ఏర్పరిచారు.
మేల్కోటలో, రామ ప్రియ అనే విగ్రహాన్ని తెప్పించి, ప్రతిష్టింపజేసి, రథోత్సవం నాడు ఆలయంలో పంచములకు ప్రవేశం కల్పించారు. శ్రీరంగంలో మత ప్రచారానికి 74 మంది శిష్యులను నియమించారు. వ్యాస సూత్ర భాష్యం గీతా భాష్యం, తర్క భాష్యం తదితరాలు రాయడం చేత ‘‘భాష్యకారుడు’’ అని త్రిదండి కావడం వల్ల ‘‘యతి రాజు’’ అని, ‘‘ఎంబరు మానారు’’ అని, లబ్ద ప్రతిష్టులు అయినారు. రామానుజులు ఆనాటి ఆచార వ్యవహారాలు, చాందసంగా మారి, సామాజిక ప్రగతికి అడ్డు రాకముందే, గుర్తించి వాటిని, మానడమో, మార్చడమో చేయాలని కర్తవ్య నిర్దేశం చేశారు. గురువు చెప్పేదంతా గుడ్డిగా నమ్మక తర్కానికి గురిచేసి, తప్పో, ఒప్పో నిర్ణయించు కోవడం పాపం కాదని, హితవు పలికారు. సమాజ శ్రేయస్సు కన్నా, వ్యక్తిగత శ్రేయస్సు ముఖ్యం కాదని రామానుజులు నొక్కి చెప్పారు.
– రామ కిష్టయ్య సంగనభట్ల…
9440595494