నదీ జలాల వివాదాలు ఇరు రాష్ట్రాలకు ముప్పే!

ఎగువ రాష్ట్రాల జల దోపిడీ పక్కకు పోయింది! ఆల్మట్టి నిండితే గాని కిందకు వరద రావడం లేదు. ఎప్పుడైనా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ – 2 తీర్పు నోటిఫై జరిగితే కృష్ణలో 285 టియంసిలు ఎగువ రాష్ట్రాలకు పోతాయి!
కెసిఆర్ రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం పెంచి పోషించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పదే పదే సంప్రదింపులు జరిపి సామరస్యంగా పరిష్కరించుకున్న కెసిఆర్ ఆంధ్ర ప్రదేశ్ తో అట్టి యత్నం ఎందుకు చేయ లేదు? తను పెద్దన్న పాత్ర వహించుతూ ట్రిబ్యునల్ నియామకానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చేత ఆమోదం పొందిన కెసిఆర్ ఆంధ్ర ప్రదేశ్ తో ఇతర నదీ జలాల వివాదాల పరిష్కారానికి కృషి చేసిన జాడ లేదు. ఆంధ్ర ప్రదేశ్ తో జల వివాదం కొనసాగితేనే భావోద్వేగాలు సుస్థిరం చేసుకోవచ్చనే వ్యూహం అమలు చేశారు. ఇప్పుడు ప్రతి పక్షంలో వున్నా నిత్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి పొగ బెట్టడంతో విధిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం జల వివాదాలను కొన సాగించక తప్పని రాజకీయ పరిస్థితి ఏర్పడింది. రెండు రాష్ట్రాలు జల వివాదాలతో ట్రిబ్యునల్స్ కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతుంటే వాస్తవంలో నష్ట పోయేది గొంతెండి పోతున్న దక్షిణ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంత వాసులు మాత్రమే.

కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు నిజమైనవి!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏ ఉద్దేశ్యంతో చెప్పారో గాని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక్క నదీ జలాల వివాదమే రావణ కాష్టంలాగా రగులుతోంది. తాజాగా గోదావరి జలాల వివాదంతో శృతి మించి రాగాన పడింది. ఈ పరిణామం ఎవరికీ శ్రేయస్కరం కాదు. ప్రజా జీవితంతో ముడి పడి వున్నందున జల వివాదాలు దురదృష్టం కొద్దీ రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలోనే కాకుండా సోదరులుగా మెలగ వలసిన ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య కూడా చిచ్చు రగిల్చే అవకాశం ఉంది . స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో పలు రాష్ట్రాలు విభజింపబడ్డాయి. కాని ఏ సందర్భంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడ లేదు.

కృష్ణ నదీ జలాల్లో తెలంగాణ వాటా తక్కువే!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా తక్కువే. బేసిన్ మొత్తం మీద పంపిణీలో జరిగిన అన్యాయమిది. లేదా ట్రిబ్యునల్ తీర్పుల సమయానికి ఆనాటి పాలకులు తెలంగాణ ప్రాంతంలో అనువైన ప్రాజెక్టులు నిర్మించక పోవడం. ఉమ్మడి రాష్ర విభజన సమయంలో జరిగిన అన్యాయం కాదిది. ఆ మాట కొస్తే అవశేష ఆంధ్ర ప్రదేశ్ లో కూడా సమతుల్యత లేదు. నిత్యం క్షామ పీడిత ప్రాంతమైన రాయల సీమకు ఇన్నేళ్లు గడిచినా న్యాయం జరగ లేదు. అటు దక్షిణ తెలంగాణకు ఇటు రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని ఇప్పటి పాలకులను నిందించి ప్రయోజనం లేదు. కోస్తా జిల్లాలకు ఏర్పడిన సౌలభ్యం బ్రిటీష్ కాలం నాటిది. ఫలితంగా వారికి నీటి వాటా సమృద్ధిగా లభ్యమైంది. పైగా బచావత్ ట్రిబ్యునల్ ను తప్పు పట్ట లేము. 1969 నాటికి నిర్మింపబడిన లేక నిర్మాణంలో వున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసింది. 1965 లో శ్రీ శైలం జలాశయం కేవలం జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుగా కాకుండా సిద్దేశ్వరం వద్ద బహులార్థ సాధక ప్రాజెక్టుగా నిర్మించి వుంటే రాయలసీమ ఎడారిగా వుండేది కాదు.

అదే విధంగా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్-2 విచారణ సమయంలో శ్రీ శైలం ఎడమ కాలువకు నీటి కేటాయింపులకు అప్పటి ప్రభుత్వం పోరాడి వుంటే మరీ తెలంగాణ పరిస్థితి ఇలా వుండేది కాదు. కనీసం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన ఆచరణకు వచ్చి వున్నా ఈ దుర్గతి తటస్థించేది కాదు. ఈ తప్పిదమే నిధులు నీళ్ల కోసం సాగిన మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఇంధనం సరఫరా చేసింది. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉద్భవించిన భావోద్వేగాలను సజీవంగా ఉంచుకొంటే తప్ప తను అధికారంలో కొనసాగడం కష్టమని భావించిన కెసిఆర్ మరీ పెంచి పోషించారు. అప్పట్లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో అయిదేళ్ల కాలం కెసిఆర్ అలాయ్ బలాయ్ ఆడినా ఇరువురు కలుసుకున్నప్పుడు విందులు ఆరగించారు-తప్ప రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై పరస్పరం ఒక్క సారైనా చర్చలు జరిపిన సందర్భం లేదు. ఇప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ క్లచస్ నుండి బయట పడటం అంత సులభం కాదు.
4136. 96 టియంసిలు సముద్రం పాలైన గోదావరి జలాలు
కృష్ణా నదిలా కాకుండా ఏటా వందలాది టియంసిలు గోదావరి జలాలు సముద్రం పాలౌతున్నాయి. ఈ ఏడు గరిష్టంగా ధవళేశ్వరం బ్యారేజీ నుండి 4136. 96 టియంసిలు సముద్రంలో కలిశాయి. కాని ఆంధ్ర ప్రదేశ్ గోదావరి వరద జలాలు ఆధారంగా నిర్మించదలచిన గోదావరి బనకచర్ల అనుసంధానంపై తెలంగాణ అడ్డు చెప్పక తప్పని రాజకీయ పరిస్థితి తెలంగాణలో నెల కొని వుంది. కేంద్ర జల సంఘానికి డిపిఆర్ లు సమర్పించ కుండా ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ ముందుగా శ్రీ కారం చుట్టింది. ఇదే పంథా నేడు ఆంధ్ర ప్రదేశ్ చేపట్టింది. తమాషా ఏమంటే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది.

బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ – 2 తో లాభ పడిన కర్ణాటక 
2014 లో రాష్ట్ర విభజన జరిగితే 2013 లో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ – 2 తుది తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తమకు సమ్మతం కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు కెక్కి గెజిట్ నోటిఫికేషన్ జరగకుండా స్టే తెచ్చింది. ఫలితంగా ఇప్పటికీ 1975 లో వెలువడిన బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలులో వుంది. వాస్తవం చెప్పాలంటే తెలంగాణకు అన్యాయం జరిగినా రాయలసీమకు అపకారం జరిగినా బచావత్ ట్రిబ్యునల్ తప్పు కానేకాదు. 1969 నాటికి అమలులో వున్న లేదా ప్రారంభించిన పథకాలను ఆధారం చేసుకొని నీటి కేటాయింపులు చేసింది.. ఆనాటి పాలకులు అటు దక్షిణ తెలంగాణ ఇటు రాయలసీమకు ఆ లోపు అవసరమైన ప్రాజెక్టులు నిర్మించకుండా తీవ్ర అన్యాయం చేసిన మాట వాస్తవం. ఆ నెపం ఇప్పుడు అవశేష ఆంధ్ర ప్రదేశ్ భరించ వస్తోంది. అయితే 2013 లో తుది తీర్పు వెలువరించిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు తీవ్ర అన్యాయం చేసింది. బచావత్ ట్రిబ్యునల్ తన తుది తీర్పు క్లాజ్ 14 (A) లో తను చేసిన కేటాయింపులు ఏ రాష్ట్రంలో గాని వినియోగంలో వుంటే సాధ్యమైనంత వరకు మార్పు చేయకూడదని పొందు పర్చిన అంశం దృష్టిలో పెట్టుకొని బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు జోలికి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వెళ్ల లేదు. 65 శాతం కింద నికర జలాలు 163 టియంసిలు సరాసరి కింద మిగులు జలాలు 285 టియంసిలు లెక్కించి మొత్తం 448 టియంసిలను అన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చుక్క మిగులు నీరు లేకుండా చేసింది. గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఇందుకు భిన్నంగా మిగులు జలాలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగించు కొనే స్వేచ్ఛ ఇచ్చింది.

అదే వెసులుబాటు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చి వుంటే ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంత చిచ్చు వుండేది కాదు. పైగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మిగులు జలాల ఆధారంగా గల ప్రాజెక్టులకు సున్నా చుట్టింది. గణాంకాలు కింద 190 టియంసిలు చూపెట్టినా ఇందులో 150 టియంసిలు క్యారీ ఓవర్ కింద చూపెట్టినవే.ఇవి మేక చన్నుతో సమానం. ఈ ఏడు శ్రీ శైలం జలాశయానికి 1600 టియంసిలు చేరినా క్యారీ ఓవర్ కింద కేటాయింపులు వున్న 150 టియంసిల ఊసే లేదు. ఇప్పుడే కాదు. ఎప్పుడూ లేదు. అదే సమయంలో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ – 2 కర్నాటక కు 170 టియంసిలు కేటాయించుతూ ఆల్మట్టి ఎత్తు 125 మీటర్లకు పెంచుకొనేందుకు అనుమతి ఇచ్చింది. పైగా మహారాష్ట్ర కు మన కన్నా ఎక్కువే ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం కొయినా ప్రాజెక్టు ద్వారా 200 టియంసిలకు పైగా అరేబియా సముద్రంలోనికి వదులు తోంది. వాస్తవంలో విభజన తర్వాత రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ తీర్పుకు వ్యతిరేకంగా పోరాటం చేయ వలసి వుండగా కెసిఆర్ ఏ నాడు ఆ ఊసెత్త లేదు. ఆంధ్ర ప్రదేశ్ సరేసరి. ప్రస్తుతం విచారణ జరుపుతున్న ట్రిబ్యునల్ తీర్పు ఏలా వున్నా ఈ లోపు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ – 2 తీర్పు నోటిఫై జరిగితే కృష్ణ లో 285 టియంసిలు ఎగువ రాష్ట్రాలకు పోతాయి. చాలమందికి గుర్తుండక పోవచ్చు ఆంధ్ర ప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కెసిఆర్ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్స్ కౌన్సిళ్లు అక్కర లేదని తామిద్దరమే ముద్దని ప్రకటన చేశారు.
మరి ఐదేళ్ల కాలంలో ఎందుకు పరిష్కారానికి పూనుకోలేదు? ఇప్పుడు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతోనే తెలంగాణా నీటి సమస్యలు పరిష్కారమౌతాయనే భ్రమలు తెలంగాణ ప్రజలకు అటు ప్రభుత్వం ప్రతి పక్షాలు కల్పించుతున్నారు. ఇది ఎండ మావుల్లో నీటిని వెతకడమే. 2013 లో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ – 2 తుది తీర్పు వచ్చినది. తమకు సమ్మతం కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు కెక్కి స్టే తెచ్చింది. పదేళ్లు గడచినా అతీ గతీ లేదు. వంశధార ట్రిబ్యునల్ 2017 లో మధ్యంతర తీర్పు ఇచ్చింది. 2019 లో ఒడిషా సుప్రీంకోర్టుకెక్కి స్టే తెచ్చింది. ట్రిబ్యునల్ 2021 లో తుది తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు స్టే వున్నందున అమలుకు రాలేదు. ప్రస్తుతం విచారణ జరుపుతున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎవరికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా ఎవరో ఒకరు సుప్రీంకోర్టు తలుపు తట్టరనే గ్యారంటీ ఏమిటి? దీని పరిష్కారానికి అంతెక్కడ?

పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతలు భవిష్యత్తు ఏమిటి
ఇప్పటికే దాదాపు 27 వేల కోట్ల రూపాయలు వ్యయం చేయబడిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను నీటి కేటాయింపులు లేవని కేంద్ర జల సంఘం తిరస్కరించింది. అదే దారిలో డిండి ఎత్తిపోతల పథకం వుంది. ఇవి కాకుండా తెలంగాణకు చెంది ఏడెనిమిది పథకాలు డిపిఆర్ ఆమోదం పొంద వలసి వుంది. ఆంధ్ర ప్రదేశ్ కు చెంది మూడు నాలుగు పథకాలు పెండింగ్ లో వున్నాయి. పాలమూర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జూరాల నుండి శ్రీ శైలం జలాశయం మార్చి వివాదాస్పదం చేశారని ప్రతి పక్షంపై ఆరోపణ చేయడం పరిష్కార మార్గం కాదు. ఆంధ్ర ప్రదేశ్ తో సంప్రదింపులతోనే ఇచ్చి పుచ్చుకొనే ధోరణి ఒక్కటే పరిష్కార మార్గం. అంతే కాదు. మొన్న జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ అధికారులు సవాళ్లు విసురుకున్నారు. ఈ సందర్భంలో తెలంగాణ అధికారి ఒకరు తాము ప్రాజెక్టులు నిర్మించుతూ డిపిఆర్ లు పంపనపుడు మీరెందుకు ఫిర్యాదు చేయలేదని వాదించడం సరికాదు. ఇలా ఒకరి కొకరు సోదరులుగా వుండ వరసిన రాష్ట్రాలు పోట్లాడుకొంటూ వుంటే కేంద్రం నిరాదరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటం కుంటు పడుతుంది.కష్టమైనా నష్టమైనా రెండు తెలుగు రాష్ట్రాల ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో వ్యవహరించడమే ఈ రోజు రేపైనా ఉత్తమ మార్గం. దురదృష్టమో అదృష్టమే ప్రస్తుతం అందరూ కృష్ణ జలాలకు చెంది ట్రిబ్యునల్ తీర్పు కోసం వేచి వున్నారు. గోదావరి జలాలకు చెంది ఈ ప్రతి బంధకం లేదు. కనీసం గోదావరి జలాల వివాద పరిష్కారానికి ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరిపితే పరిష్కారం లభించక పోదు. క్షిపణి రాకెట్లతో పోరు సాగుతున్న గాజాలోనూ రష్యా యుక్రెయిన్ లాంటి యుధ్దాల విరమణ సంప్రదింపులతో సాధ్యమౌతున్నపుడు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ జల వివాదాలు చర్చలతో ఎందుకు పరిష్కారం కావు?

వి. శంకరయ్య 

విశ్రాంత పాత్రికేయులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page