– మూడు విడతల్లో 10వేల రెవెన్యూ సదస్సులు,
– 8.58 లక్షల దరఖాస్తులు స్వీకరణ
– దశాబ్దకాలం భ్రష్టుపట్టిన రెవెన్యూ వ్యవస్ద ప్రక్షాళన
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21: దశాబ్దకాలంపాటు బీఆర్ఎస్ పాలనలో విధ్వంసమైన రెవెన్యూ వ్యవస్ధను ప్రక్షాళన చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్వరాష్ట్రంలో ఏళ్లతరబడి తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆశయంతో తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని, రెవెన్యూ వ్యవస్దలో భూ భారతికి ముందు, భూ భారతి తర్వాత స్పష్టమైన మార్పు కనిపిస్తున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ముగిసిన నేపధ్యంలో అధికారులతో మంత్రి శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన ఆర్వోఆర్ చట్టాన్ని తిరగరాసి పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తూ రైతుల కష్టాలు తీర్చడమే ధ్యేయంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. పదేళ్లలో రైతులు పడ్డ కష్టాలు, బాధలు, వారు ఏవిధమైన సమస్యలను ఎదుర్కొన్నారో చెప్పడానికి ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. మూడు దశల్లో దాదాపు 10లక్షలకుపైగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ చట్టాన్ని దశల వారీగా అమలులోకి తీసుకొచ్చామని, మొదటి దశలో ఏప్రిల్ 17 నుంచి 30వ తేదీ వరకు నాలుగు మండలాల్లో నిర్వహించిన 72 రెవెన్యూ సదస్సుల్లో 12వేల దరఖాస్తులు, తర్వాత రెండవ దశలో మే 5వ తేదీ నుంచి 28 మండలాల్లో నిర్వహించిన 414 సదస్సుల్లో 46 వేల దరఖాస్తులు రాగా సాదా బైనామాల అంశం మినహా 60 శాతంపైగా సమస్యలకు పరిష్కారం చూపామని మంత్రి వివరించారు. ఈనెల 3 నుంచి 20వ తేదీ వరకు 561 మండలాల్లో 10,239 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించామని, ఈ సదస్సుల్లో భూ సమస్యలకు సంబంధించి 8 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మొత్తంగా మూడు విడతల్లో 593 మండలాల్లో 10,725 రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ఇందులో 8.58 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 67వేలు, భద్రాద్రి కొత్తగూడెం 61వేలు, వరంగల్ 54 వేలు, జయశంకర్ భూపాలపల్లి 48వేలు, నల్గొండ 42వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రెవెన్యూ సదస్సులకు ముందురోజే ఆయా గ్రామాల్లో రైతులకు ఉచితంగా దరఖాస్తులను ఇచ్చామని తెలిపారు. రెవెన్యూ అధికారులే ప్రజల వద్దకు వచ్చి ఎలాంటి రుసుము లేకుండా దరఖాస్తులను స్వీకరించారని శ్రీనివాస్రెడ్డి చెప్పారు. స్వీకరించిన వాటికి రశీదులను అందజేశారన్నారు. వాటిల్ల్లో ఇప్పటివరకు 3.27 లక్షల దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశారంటూ మిగిలిన వాటిని కూడా త్వరితగతిన నమోదు చేయాలని అధికారులకు మంతి శ్రీనివాసరెడ్డి సూచించారు.