- చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఘాతుకం
- నేపాలీ గ్యాంగ్ పనే అని పోలీసుల అనుమానం
- క్లూస్ దొరికాయి.. త్వరలోనే పట్టుకుంటాం: సీపీ సజ్జనార్
హైదరాబాద్, ప్రజాతంత్ర,మే 8: జూబ్లీహిల్స్లోని ప్రశాసన్ నగర్లో రిటైర్డ్ డీజీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనుజా (55) హత్య (IPS Officer Wife Murder)కు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. రిటైర్డ్ డీజీ సతీమణి తనూజ హత్యకు గురైందని తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. రిటైర్డ్ డీజీ భార్య తనుజాను గురువారం రాత్రి రెండు గంటలకు దుండగులు హత్య చేశారని తెలిపారు.
నేపాలి గ్యాంగ్ పనిగా ప్రాథమికంగా తాము ఒక అంచనాకు వచ్చామని అన్నారు. కొన్ని క్లూస్ లభించాయని.. ఆ క్లూస్ ఆధారంగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నేపాలి పనివాళ్లపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేపాలి పని మనుషులు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేరాలకు పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ వెల్లడించారు. గురువారం రాత్రి రిటైర్డ్ డీజీ ఇంట్లో ఎవరు లేనప్పుడు పనిమనిషి కల్పన అనే మహిళ మరికొందరితో కలిసి ఈ దారుణం చేసిందని తెలిపారు. ఈ ఘటన సమయంలో పిల్లలు ఇద్దరు పై ఫ్లోర్లో ఉన్నారని.. తనుజ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారని వెల్లడించారు.
ఇంట్లో ఉన్న పనిమనిషి కల్పనతో బయట వ్యక్తులు కాంటాక్ట్ పెట్టుకొని ఈ క్రైమ్ చేశారని చెప్పారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని.. నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. నేపాలి పనిమనుషులు ఇంట్లో ఏడాది, రెండో ఏడాది పనిచేసిన కూడా వాళ్లపై నిఘా ఉంచాలని సీపీ సజ్జనార్ అన్నారు. ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంటున్నామని తెలిపారు. చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను ఈ గ్యాంగ్ హత్య చేసిందని చెప్పారు. రిటైర్డ్ డీజీ తల్లి కోసం ఆమె హైదరాబాద్ వచ్చారని తెలిపారు. ఇటీవల రిటైర్డ్ డీజీ తల్లి మరణించారని.. అప్పటి నుంచి తనుజ ఇక్కడే ఉంటున్నారని వివరించారు. ఈ కేసులో ఎంత బంగారం, నగదు పోయిందనే అంశాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. నిందితులు బ్యాక్ గేట్ నుంచి ఇంట్లోకి ప్రవేశించారని.. ఘటన అనంతరం వెనుక నుంచి పారిపోయారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.





