21 నుంచి 27 వరకు పరీక్షలు
మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు నిర్వహణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: తెలంగాణలో ‘గ్రూప్-1’ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. అక్టోబరు 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే మధ్యాహ్నం 12:30 నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. మధ్యాహ్నం1.30 తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అక్టోబరు 14 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు హాల్టికెట్లో పొందుపరిచిన అన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జామ్ కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను జులై 7న విడుదల చేశారు. ఇందులో 31,382 మంది అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్కు అర్హత సాధించారు. వీరికి అక్టోబరు 21 నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్లో మొత్తం 6 పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ను 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. మెయిన్ పరీక్షలను ప్రతీ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి. గ్రూప్-1 మెయిన్స్ లో మొత్తం 6 పేపర్లు ఉంటాయి. వీటిని అభ్యర్థి ముందుగా ఎంచుకున్న మాధ్యమంలోనే రాయాల్సి ఉంటుంది. పేపర్లో కొంత భాగాన్ని ఇతర భాషలో రాయడానికి అభ్యర్థికి అనుమతి లేదు.





