– ఎకరాకు రూ.266.53 కోట్లు
– రిజర్వ్ ధరపై 52.3 శాతం ప్రీమియం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: హైదరాబాద్లోని రాయదుర్గ్ పాన్మక్తా ప్రాంతంలో పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ) నిర్వహించిన తాజా భూముల వేలంనకు భారీ స్పందన లభించింది. రాయదుర్గ్లోని 5.38 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్-పీ2ను ఎకరాకు రూ.269 కోట్ల ధరకు వేలం వేయగా మొత్తం రూ.1,447.22 కోట్ల ఆదాయం లభించింది. గత వారం నిర్వహించిన ప్లాట్-పీ1 వేలం కూడా అత్యంత భారీ ధరను నమోదు చేసింది. 5.25 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ప్లాట్ ఎకరాకు రూ.264 కోట్ల ధర పలకగా మొత్తం రూ.1,386 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో వేలం విలువలో 25 శాతం మొత్తాన్ని తొలి దశ చెల్లింపుగా ఇప్పటికే ప్రభుత్వం అందుకుంది. తాజాగా నిర్వహించిన పీ2 వేలం ఫలితాన్ని, గత వారం పీ1 వేలం ఫలితాన్ని కలిపితే 10.63 ఎకరాల భూమి ద్వారా టీజీఐఐసీకి ఏకంగా రూ.2,833.22 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ రెండు వేలాల్లో ఎకరాకు సగటున రూ.266.53 కోట్ల ధర లభించడం విశేషం.
పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనం
కేవలం వారం రోజుల వ్యవధిలో నిర్వహించిన రెండు వేలాల్లోనూ ఎకరాకు రూ.260 కోట్లకుపైగా ధర పలకడం రాయదుర్గ్ ప్రాంతంపై హైదరాబాద్ భవిష్యత్ వృద్ధి అవకాశాలపై ప్రముఖ డెవలపర్లు, పెట్టుబడిదారుల్లో ఉన్న బలమైన ఆసక్తికి అద్దం పడుతోంది. విస్తరిస్తున్న వ్యాపార వ్యవస్థ, మెరుగైన మౌలిక వసతులు, రవాణా అనుసంధానం, దేశంలోని ప్రముఖ వ్యాపార–పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్కు పెరుగుతున్న ప్రాధాన్యం.. ఇవన్నీ రాయదుర్గ్ భూములకు భారీ డిమాండ్కు కారణమయ్యాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామం హైదరాబాద్ను దేశంలోనే అత్యంత చురుకైన, ఆకర్షణీయమైన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా మరోసారి నిలబెట్టిందని టీజీఐఐసీ వర్గాలు తెలిపాయి.
ప్రజా ప్రభుత్వ విధానాలకు ప్రశంసలు
ఈ రికార్డు సందర్భంగా టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.శశాంక మాట్లాడుతూ హైదరాబాద్, తెలంగాణపై పెట్టుబడిదారుల విశ్వాసానికి తాజా వేలం బలమైన నిదర్శనమని అన్నారు. రాయదుర్గ్ ప్రాంతం అత్యుత్తమ వ్యాపార, పెట్టుబడి గమ్యస్థానంగా కొనసాగుతున్న విషయాన్ని ఈ వేలం మరోసారి నిరూపించిందన్నారు. వ్యూహాత్మకంగా కీలక ప్రాంతాల్లో ఉన్న భూములకు ఎంతటి డిమాండ్ ఉందో ఈ ధరలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. పారదర్శకమైన, పోటీతో కూడిన వేలం ప్రక్రియ ద్వారా ప్రభుత్వ భూములకు ఉన్న విలువను గరిష్ఠస్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని శశాంక తెలిపారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన ప్రభుత్వ విధానాలు, నిరంతర మౌలిక వసతుల అభివృద్ధి ఈ విజయానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.
ఎంఎస్టీసీ వేదికగా వేలం
ఈ భూముల వేలం ప్రక్రియను ఎంఎస్టీసీ ఈ-ఆక్షన్ వేదిక ద్వారా నిర్వహించారు. టీజీఐఐసీకి ప్రత్యేక లావాదేవీ సలహాదారుగా జేఎలఎల్ వ్యవహరించింది. మార్కెట్లో భూములకు సరైన స్థానం కల్పించడం, పెట్టుబడిదారులను ఆకర్షించడం, వారితో అనుసంధానం చేయడం, పోటీ ధరల వెల్లడి జరిగేలా చూడడంలో జేఎలఎల్ కీలక సహకారం అందించింది.
ప్రభుత్వ ఆస్తులకు భారీ విలువ
రాయదుర్గ్లో జరిగిన ఈ రెండు వేలాల సమష్టి ఫలితం ప్రభుత్వం చేపడుతున్న వ్యూహాత్మక భూముల నగదీకరణ ప్రక్రియలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. వ్యూహాత్మకంగా కీలక ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను పారదర్శకంగా, మార్కెట్ ఆధారిత విధానంలో వేలం వేయడం ద్వారా భారీ విలువను సృష్టించవచ్చని ఈ ఫలితాలు చాటిచెబుతున్నాయి. కేవలం 10.63 ఎకరాల భూమితో రూ.2,833.22 కోట్ల ఆదాయం రావడం రాయదుర్గ్ ప్రాంతానికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని, హైదరాబాద్ పెట్టుబడి గమ్యస్థానంగా సాధిస్తున్న బలాన్ని మరోసారి స్పష్టం చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





