– ఏయూఎస్ బయోటెక్-2025 కాన్ఫరెన్స్కు ఆహ్వానం
– దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి ఈయనే
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు అరుదైన అవకాశం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే AusBiotech ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్-2025లో కీలకోపన్యాసం చేసే అవకాశం లభించింది. ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ఏయూఎస్ బయోటెక్, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో మెల్బోర్న్లో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం ఆయనకు మాత్రమే దక్కింది. రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలపై ఆయన ప్రసంగించనున్నారు. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్గీచీ బుధవారం మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి మార్గ నిర్దేశంలో గ్లోబల్ ఫార్మా, బయో టెక్నాలజీ, మెడ్టెక్ ఆవిష్కరణ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు మంత్రి శ్రీధర్బాబు చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఆస్ట్రేలియా-తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చొరవ చూపాలని కోరారు. ‘ఈ ఆహ్వానం లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతికి అంతర్జాతీయ స్థాయిలో దక్కిన గౌరవం. ప్రపంచవ్యాప్తంగా ఏడు అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ నగరం మనదే. ఈ రంగంలో కొత్తగా రూ.63వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాం. మరిన్ని తీసుకొచ్చేందుకు ఈ వేదికను మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం. ఆస్ట్రేలియా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది’ అని మంత్రి శ్రీధర్బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





