– సునీత నామినేషన్ దాఖలు
- జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ విజయయాత్ర
– పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పార్టీలు, ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నది కాదని, పదేండ్ల అభివృద్ధి పాలనకు రెండు సంవత్సరాల అరాచక పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వదికుంట్ల తారకరామారావు అన్నారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారని, ఆమె గెలుపుతోనైనా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మహిళలకు నెలకు రూ.2500 ఇస్తుందని ఆశిస్తున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్ వాగ్దానాలకు మోసపోయిన యువత రెండు లక్షల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాన్నారు. తమ ఇళ్లు కూలగొట్టిన అరాచకాలను చూసిన తర్వాత ఈ ఎన్నికలో బీఆర్ఎస్ గెలవాలని, ఆ అరాచకాలు ఆగాలని హైదరాబాద్ నగర పేదలు కోరుకుంటున్నారన్నారు. మూతపడుతున్న బస్తీ దవఖానాలు, ఉచిత తాగునీరు ఆగిపోతున్న విషయాలు ప్రజలందరూ చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కూడా హైదరాబాదులో కట్టలేదని, కేసీఆర్ హైదరాబాద్లో కట్టిన లక్ష ఇళ్లు, ఇచ్చిన ఇళ్ల పట్టాలు, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజలకు గుర్తుకు వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన మైనార్టీలు ఈ ఎన్నిక ఒక అవకాశంగా భావిస్తున్నారని, ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వకుండా దారుణంగా వారిని అవమానపరిచిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ఒక అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు. తమకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్, రిజర్వేషన్లు అన్నీ మోసమని, ఈ అంశంలో గుణపాఠం చెప్పడానికి రాష్ట్రవ్యాప్తంగా బీసీలు సిద్ధంగా ఉన్నారని, దళితబంధు, అభయహస్తం అని చెప్పి మోసం చేయడంతో దళితులు కూడా ఆగ్రహంతో ఉన్నారని, దీంతో తమ అభ్యర్థికి అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నదని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ఆధ్వర్యంలో మరోసారి పాలన రావడానికి ఈ ఉప ఎన్నిక పునాది కాబోతున్నదన్నారు. మరోసారి రాష్ట్రంలో గులాబీ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కాబోతున్నదని, అన్ని వర్గాల అండతో తమ పార్టీ అభ్యర్థి సునీత ఘన విజయం సాధించబోతున్నారని అన్నారు. ఈ విఫల కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరూ తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్లో ప్రతి ఒక్కరికి, నియోజకవర్గానికి విశేషమైన సేవలు అందించిన నాయకుడు గోపీనాథ్ అన్నారు. హైదరాబాద్ నగరంలో అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ గెలుపొందిందంటే అప్పటి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గోపీనాథ్ కృషి కూడా ఉందని, ఆయన అకాల మరణంతో బాధపడుతున్న కుటుంబాన్ని ఆదుకోవాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించి ఆయన సతీమణి సునీతకి టికెట్ కేటాయించారని చెప్పారు. సునీతకు సహాయం కోసం పార్టీ కీలక నాయకులంతా పనిచేయాలని కేసీఆర్ ఆదేశించారని, అందరి ఆశీర్వాదాలతో సునీత గెలువబోతున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





