శాంతి చర్చలు ప్రారంభించాలి
వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతల డిమాండ్
నల్లగొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: ఛత్తీస్ గఢ్ లోని కర్రెగుట్టలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మారణకాండను ఆపివేసి శాంతిని నెలకొల్పాలని, చర్చలు జరపాలని, వామపక్ష పార్టీల నాయకులు సామాజిక ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర బలగాలను వెనక్కి తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ మారణకాండకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.పర్వతాలు, సిపి(ఐ)ఎం పార్టీ ప్రతినిధి చిన్నపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పనిగట్టుకొని హింసకు తెరలేపడం, మారణహోమం సృష్టించడం భారతదేశం ఆటవిక రాజ్యం కాదన్నారు.
ఈ దేశంలోని అడవులలో నిక్షిప్తమై ఉన్న విలువైన ఖనిజ సంపదను ఆదాని, అంబానీలకు కట్టబెట్టడానికే కేంద్ర ప్రభుత్వం ఆదివాసులను అంతం చేయడానికి పూనుకున్నదని వారన్నారు. అడవులను కాపాడుతున్న ఆదివాసీలను ఏరివేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. దేశ సంపదను కాపాడుతున్న వారిపై కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు దుర్మార్గమన్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏకపక్షంగా ఈ దేశ పౌరులను చంపడం విద్రోహపూర్వక చర్య అని అన్నారు. సిఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరి సాగర్, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున మాట్లాడుతూ.. దేశంలోనే మేధావులు బుద్ధి జీవులు చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించిన సూచన మేరకు సాయిధ పోరాటాన్ని ఎంచుకున్న మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ గత కొన్ని మాసాలుగా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను వెచ్చించి నరమేధాన్ని సృష్టిస్తుందని, ప్రజాస్వామ్య మునగడకు ఇలాంటి చర్యలు తీవ్ర ప్రమాదమని వారన్నారు. ఆదివాసీల జీవించే హక్కును హననం చేసే అధికారం కేంద్రానికి లేదన్నారు. రాజ్యాంగానికి లోబడి తక్షణమే శాంతి చర్చలు ప్రారంభించాలని,ఆదివాసి హక్కులను కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత అయిన రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకుంటే సరిపోదని ఆ రాజ్యాంగంలో ప్రస్తావించబడిన ఆదివాసీ హక్కులను కాపాడే దిశగా తమ గొంతును విప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, సిపిఎంఎల్ (ఎన్.డి.ఆర్)రాష్ట్ర నాయకులు కె.అనంతరెడ్డి, ప్రజాప్రంట్ జిల్లా బాధ్యులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ దేశ మూలవాసులైన ఆదివాసీల ఆకాంక్షలు పట్టించుకోకుండా, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపకుండా మానవ రహిత పైలట్ లను ఉపయోగించి చత్తీస్గడ్ అడవులను శత్రుదేశం గా ప్రకటించుకొని సైనిక బలగాలతో చేస్తున్న నరమేధం ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యలు అన్నారు.విధ్వంసక అభివృద్ధి నమూనాను అడ్డంపెట్టుకొని బిజెపి ఫాసిస్టు విధానాలతో ముంధుకు పోతుందన్నారు. ప్రజాస్వామిక డిమాండ్లను పట్టించుకోకుండా బిజెపి ఏకపక్షంగా ముందుకు పోతున్న విధానం చూస్తే అడవులను ఆదివాసీలను అన్యాక్రాంతం చేసి ఖనిజ సంపదను వెలికితీయడానికేనని స్పష్టమవుతుందన్నారు. గత కొన్ని నెలల నుంచి సుమారు 500 మంది ఆదివాసీలను,మావోయిస్టులను కాల్చి చంపినా ఈ దేశంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గాని,ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా బిఆర్ఎస్ కు గాని ఏం మాత్రం పట్టింపు లేదన్నారు.తక్షణమే కర్రెగుటల్లో కూంబింగ్ ఆపివేయాలని ఆదివాసి హక్కులను కాపాడాలని శాంతి చర్చలు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి గాదపాక రమేష్, సిపియు.ఎస్.ఐ జిల్లా కార్యదర్శి గద్దపాటి సురేందర్, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షం, ఐఎఫ్టియు జిల్లా నాయకులు బొంగరాల నరసింహ, బొమ్మ పాల అశోక్, టీఎస్ యు జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతగోని జనార్దన్ గౌడ్, విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా గౌరవాధ్యక్షులు ఆర్.విజయకుమార్, ప్రజా సంఘాల నాయకులు చింతా నరసింహ, ఏడుకొండలు వెంకటేశం కెవిపిఎస్ నాయకులు బొల్లు రవీందర్,రావుల వీరేష్ పాల్గొన్నారు.