మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలి
సీఎం రేవంత్ రెడ్డికి శాంతి చర్చల కమిటీ వినతి
హైదరాాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని, కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఆదివారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. ఈసందర్భంగా సీఎం రేవంత్ కు శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ తదితరులు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా శాంతి చర్చల కమిటీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తోంది తప్ప శాంతిభద్రతల అంశంగా పరిగణించదని అన్నారు. గతంలో నక్సలైట్ల తో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉందని అన్నారు. ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు , సూచనలు తీసుకుంటామని, మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.