– ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్షే
– ధాన్యానికి కొర్రీలు.. రైతులను మోసం చేయడమే
– ఆధునిక సాగు పద్ధతులతో పండగలా వ్యవసాయం
– సిరిసిల్లలో డిప్యూటీ సీఎం భట్టి
సిరిసిల్ల, ప్రజాతంత్ర, మే 5 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను పురస్కరించుకుని ఉమ్మడి ఏపీలో డిజైన్ చేసిన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట గ్రామంలోని పంతులుగారి తోటలో బయోస్ట్రాటమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రైతులనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని ఒక ప్రధాన సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏపీలోని పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినప్పటికీ తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా ఆ హోదా కల్పించకపోవడం రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షకు నిదర్శనమన్నారు. ప్రతి పంటను కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నా ఈ ధాన్యాన్ని కేంద్రం తీసుకోకుండా కొర్రీలు పెట్టడం, నిధుల విడుదలలో జాప్యం చేయడం రైతుల్ని మోసం చేయడమేనని విమర్శించారు. కేవలం కొన్ని పంటలకే మద్దతు ధర ప్రకటించి మిగిలిన వాటి విషయంలో కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని, రాష్ట్రం సేకరించిన ప్రతీ గింజను కేంద్రమే సేకరించి సకాలంలో నిధులు విడుదల చేయాలని కోరారు. వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ వరి గడ్డిని ముడిసరకుగా ఉపయోగించి బయో గ్యాస్ ఉత్పత్తి చేసే బృహత్తర ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం కార్యరూపంలోకి తెస్తోందన్నారు. సాధారణంగా పంట కోతల అనంతరం రైతులు పొలాల్లోనే గడ్డిని కాల్చివేయడం వల్ల వాతావరణం కలుషితమై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోతున్న తరుణంలో ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. దీనివల్ల పర్యావరణానికి రక్షణ కలగడమే కాక రైతులకు వ్యర్థాల ద్వారా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల బాటలో మన రైతాంగం కూడా అడుగులు వేయాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందన్నారు. సమాజానికి ఆహారాన్ని అందించే రైతు ఆరోగ్యకరమైన గాలిని కూడా అందించాలనే ఉద్దేశంతో పంట వ్యర్థాలను కాల్చకుండా బయో గ్యాస్ ప్లాంట్లకు సరఫరా చేయాలని కోరారు. మరోవైపు వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు పంట మార్పిడి విధానాన్ని రైతులు పాటించాలని కోరారు. కేవలం వరి మీదనే ఆధారపడక ఉద్యానవన పంటలు, చిరు ధాన్యాలు, ఆయిల్ పామ్ వంటి లాభదాయకమైన పంటల వైపు దృష్టి సారించినప్పుడే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని తెలిపారు. వీటి సాగు వల్ల రైతులకు ఆదాయం పెరగడమే కాక సమాజానికి పోషక విలువలతో కూడిన ఆహారం అందించిన వారవుతారని చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గింజకూ కనీస మద్దతు ధర కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉందని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆధునిక సాగు పద్ధతులను అవలంబించడం ద్వారానే వ్యవసాయం పండగలా మారుతుందని, ఈ మార్పులో రైతులు భాగస్వాములు కావాలని కోరారు.
గంభీరావుపేటలో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ సమీక్ష

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేస్తామని, మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని తెలిపారు. కొనుగోలు సజావుగా సాగేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బిగితే మంత్రులకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





