– దేశంలోనే సరికొత్త అధ్యాయానికి నాంది
– 1,500 ఎకరాల విస్తీర్ణంలో భారీ నగరం
– త్వరలో వికారాబాద్ జిల్లా చేవెళ్లలో ఏర్పాటు
– సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: సాంకేతిక రంగంలో ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హైదరాబాద్ మహానగరం ఇప్పుడు మరో సంచలన ప్రాజెక్టుకు వేదిక కాబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ను తట్టుకునేందుకు దేశంలోనే మొట్టమొదటి సారిగా కేవలం డేటా సెంటర్ల కోసమే ఒక పూర్తి ‘డేటా సెంటర్ నగరాన్ని’ అభివృద్ధి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో ఈ ప్రాజెక్ట్ దేశంలోనే ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. హైదరాబాద్కు సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో దాదాపు 1,500 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ అత్యాధునిక డేటా సెంటర్ నగరాన్ని నిర్మించనున్నారు. డేటా సెంటర్లు అంటే కేవలం కంప్యూటర్లు ఉండే భవనాలు మాత్రమే కాదు. వాటిలో వేలాది హై-ఎండ్ సర్వర్లు ఉంటాయి. వాటిని నిరంతరం రన్ చేయడానికి, సురక్షితంగా ఉంచడానికి విస్తృతమైన శీతలీకరణ వ్యవస్థలు, విద్యుత్ సబ్స్టేషన్లు, భారీ ట్రాన్స్ఫార్మర్లు, నెట్వర్క్ పరికరాలు, భవిష్యత్ విస్తరణకు భారీ స్థలం అవసరం. అందుకే ఈ ప్రాజెక్ట్ కోసం 1,500 ఎకరాల భూమిని కేటాయించారు. డేటా సెంటర్ సిటీలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాలకు ప్రత్యేక మౌలిక వసతులు కల్పించనున్నారు. హైసెక్యూరిటీ జోన్లు, అత్యాధునిక ఫైబర్ కనెక్టివిటీ, విశ్వసనీయ విద్యుత్ సరఫరా, డిజిటల్ నెట్వర్క్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రాజెక్టు రూపకల్పన జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నీరు, విద్యుత్, రవాణా, డిజిటల్ కనెక్టివిటీపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. భూమి గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.ఇది ఒక సాధారణ ఐటీ పార్క్ లేదా పారిశ్రామిక ప్రాంతం లాంటిది కాదు. డేటా సెంటర్ కంపెనీల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ప్లగ్-అండ్-ప్లే పద్ధతిలో మౌలిక సదుపాయాలను ఇక్కడ ముందే సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఒకే ప్రాంగణంలో పవర్ సబ్స్టేషన్లు, హై-స్పీడ్ ఫైబర్ నెట్వర్క్లు, కూలింగ్ సిస్టమ్లు, బ్యాకప్ పవర్, అత్యాధునిక భద్రతా వ్యవస్థలు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల వివిధ కంపెనీలు తమ వ్యాపారాల కోసం వేర్వేరు ప్రాంతాల్లో విద్యుత్, నీరు లేదా ఇంటర్నెట్ కనెక్షన్ల కోసం తిరగాల్సిన అవసరం ఉండదు. అతి తక్కువ సమయంలోనే తమ సర్వర్లను ఇక్కడ ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించవచ్చు.ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రాధాన్యత కలిగిన, ప్రత్యేకమైన అంశం నీటి పునర్వినియోగం. డేటా సెంటర్లు రోజుకు 24 గంటలు పనిచేస్తాయి. కాబట్టి సర్వర్లు వేడెక్కకుండా చూడటానికి భారీగా నీరు అవసరమవుతుంది. తాగునీటిపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు, ఇక్కడ మంచినీటికి బదులుగా శుద్ధి చేసిన మురుగునీటిని ఉపయోగించనున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ కి చెందిన 41 మురుగునీటి శుద్ధి కర్మాగారాల నుండి సుమారు 530 శుద్ధి చేసిన నీటిని రెండు వేర్వేరు పైప్లైన్ల ద్వారా ఈ డేటా సెంటర్ నగరానికి, పారిశ్రామిక ప్రాంతాలకు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు డేటా సెంటర్లను కేవలం వెబ్సైట్లు, సాధారణ క్లౌడ్ స్టోరేజ్ కోసం వాడేవారు. కానీ నేడు జెనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ వాడకం విపరీతంగా పెరిగింది. గతంలో ఒకే సర్వర్ ర్యాక్ 5 నుండి 15 కిలోవాట్ల విద్యుత్ను వినియోగించుకోగా, ప్రస్తుత జీపీఎస్-ఆధారిత ఏఐ సిస్టమ్లకు 30 నుండి 120 కిలోవాట్ల విద్యుత్ అవసరం అవుతోంది. ఈ భారీ విద్యుత్ డిమాండ్ను తట్టుకోవడానికి ఈ ప్రాజెక్ట్లో కంపెనీలకు నిరంతరాయంగా ‘ఓపెన్ యాక్సెస్ పవర్’ అందించనున్నారు. హైదరాబాద్ ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, కంట్రోల్ఎస్, క్యాపిటాల్యాండ్, ఎస్టిటి గ్లోబల్, ఎన్టిటి డేటా వంటి దిగ్గజ కంపెనీల డేటా సెంటర్లకు నిలయంగా మారింది. ప్రస్తుతం ఇక్కడ 150 నుండి 200 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లు పనిచేస్తుండగా, సుమారు 5 గిగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. అంతేకాకుండా, తెలంగాణలో మరో 11 గిగావాట్లకు పైగా సామర్థ్యం గల ప్రతిపాదిత ప్రాజెక్టుల కోసం అవగాహన ఒప్పందాలు కుదిరాయి. విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డేటా సెంటర్ సంస్థలకు ఓపెన్ యాక్సెస్ విధానంలో ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. చందనవెల్లి, భారత్ ఫ్యూచర్ సిటీ, ఫ్యాబ్ సిటీ ప్రాంతాలు కూడా డేటా సెంటర్ క్లస్టర్లుగా అభివృద్ధి చెందుతున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





