ఏఐలో ఆవిష్కరణల వేదికగా రాష్ట్రం

– ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: కృత్రిమ మేథస్సు రంగంలో నూతన ఆవిష్కరణలకు వేదికగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కొత్తగా తెలంగాణ ఆర్టిఫిషియల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ ను ఏర్పాటు చేసినట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడిరచారు. 2035 నాటికి ప్రపంచంలోని 20 అతి పెద్ద ఏఐ హబ్‌లలో తెలంగాణకు స్థానం కల్పించడమే దీని ఏర్పాటు వెనక ఉన్న ప్రధాన లక్ష్యమని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఐటి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, ‘మీ సేవ’ కమిషనర్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సభ్యులుగా ఉంటారన్నారు. భవిష్యత్తు అంతా కృత్రిమ మేథ రంగానిదే. ఇది విస్మరించలేని నిజం. దానికనుగుణంగా ఏఐలో పరిశోధన, ఆవిష్కరణల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. దేశంలో కృత్రిమ మేథ అంటే మొట్టమొదటగా తెలంగాణ మాత్రమే గుర్తుకొచ్చేలా విస్తృత ఎకోసిస్టంను నెలకొల్పుతున్నాం. సీిఎం రేవంత్‌ రెడ్డి ఆలోచనలలో భాగంగా ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌ తుదిరూపు దాల్చింది. పౌర సేవలు, ఆరోగ్యం, రవాణా, విద్య రంగాల్లో ఏఐ పరిష్కారాలతో పరివర్తనాత్మక ఫలితాలు (ట్రాన్స్‌ఫర్మేటివ్‌ రిజల్ట్స్‌) సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇ-గవర్నెన్స్‌లో ఏఐ ఆధారిత సేవలను వినియోగిస్తాం. దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండేలా అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. దీని ద్వారా పాలనలో మరింత పారదర్శకత కూడా సాధ్యమవుతుంది. 2024లో ఏఐ గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించాం. ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టిన మొదటి రాష్ట్రంగా అందరి దృష్టినీ ఆకర్షించాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌(డీపీఐ) ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్రానిది. తెలంగాణ డేటా ఎక్ఛ్సేంజి టీజీడీఎక్స్‌) ఇప్పటికే పూర్తిస్థాయిలో పనిచేస్తోంది. ట్రిపుల్‌ ఐటి, బిట్స్‌, ఐఎస్‌బి, నల్సార్‌, హైదరాబాద్‌ ఐఐటి, సి-డాక్‌తో పాటు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఇన్ఫోసిస్‌, అమెజాన్‌ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాం అని ్షశ్రీధర్‌బాబు తెలిపారు.

నైపుణ్య మార్పిడితో ఉమ్మడి పురోగతికి అడుగులేద్దాం

– క్యూబా రాయబారితో మంత్రి శ్రీధర్‌బాబు భేటీ

హైదరాబాద్‌: ద్వైపాక్షిక సహకారం ద్వారా నైపుణ్యాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకొని ఉమ్మడి పురోగతి వైపు కలిసి అడుగేద్దామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. తెలంగాణ- క్యూబా మధ్య సత్సంబంధాలను పెంపొందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. క్యూబా రాయబారి జువాన్‌ కార్లోస్‌ మార్సన్‌ అగులేరా, ఫస్ట్‌ సెక్రటరీ మిక్కీ డియాజ్‌పెరెజ్‌తో ఆయన మంగళవారం సచివాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బయో టెక్నాలజీ, ఫార్మా, హెల్త్‌ కేర్‌, ఐటీ, ఏఐ, ఇన్నోవేషన్‌, అగ్రికల్చర్‌, సస్టైనబుల్‌ ఫార్మింగ్‌, స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌, కల్చర్‌ తదితర అంశాల్లో ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి గల అవకాశాలపై చర్చించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా మార్చేందుకు చేస్తున్న కృషిని వివరించారు. టీ-హబ్‌, టీ-వర్క్స్‌, వీ-హబ్‌ ద్వారా క్యూబా స్టార్టప్స్‌కు మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్స్‌, ఫార్మా రీసెర్చ్‌, పబ్లిక్‌ హెల్త్‌ డేటా తదితర అంశాల్లో సహకారం అందిస్తామన్నారు. ప్రపంచంలోని టాప్‌-7 లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్లలో ఒకటిగా నిలిచిన జీనోమ్‌ వ్యాలీని సందర్శించాలని క్యూబా ప్రతినిధులను ఆహ్వానించారు. బాక్సింగ్‌, అథ్లెటిక్స్‌లో క్యూబా నైపుణ్యాన్ని తెలంగాణకు అందించాలని కోరారు. నూతన ఆవిష్కరణలు, ఇన్నోవేషన్‌ డ్రివెన్‌ ప్రోగ్రెసివ్‌ విధానాలను అవలంబిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని క్యూబా రాయబారి జువాన్‌ కార్లోస్‌ మార్సన్‌ అగులేరా పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ సెల్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌, తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page