– చర్చలకు రావడం లేదని తేల్చిన ఇరాన్
టెహ్రాన్, ఏప్రిల్ 20: పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య సోమవారం జరగాల్సిన రెండో దఫా శాంతి చర్చలు ఆగిపోయాయి. చర్చలకు రావడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. యూఎస్ నౌకాదళం తమ కార్గో షిప్ను స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇరాన్ శాంతి చర్చల్లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పింది. 22వ తేదీతో అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. ఈ ఒప్పందం గడువు ముగిసే లోపు అమెరికా-ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ వేదికగా శాంతి నెలకొంటుందని చాలా దేశాలు భావించాయి. అయితే ప్రపంచ దేశాల ఆశలు ఫలించలేదు. అమెరికా వైఖరి కారణంగానే శాంతి చర్చలకు వెళ్లడం లేదని టెహ్రాన్ పేర్కొంది. ఇరాన్ జెండాతో ఉన్న వాణిజ్య నౌక తౌస్కాను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. నౌకపై తొలుత కాల్పులు జరిపి ఆపై అదుపులోకి తీసుకున్నాయి. అమెరికా తమ నౌకను స్వాధీనం చేసుకోవడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యను ఇరాన్పై దాడిగా భావిస్తూ త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. అమెరికా చర్యలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఇస్లామాబాద్లో మలి విడత చర్చలకు రావడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అలాగే ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా దిగ్బంధం కొనసాగించడం, శాంతి చర్చల నేపథ్యంలో అగ్రరాజ్యం పెట్టిన డిమాండ్లు కూడా ఇరాన్కు రుచించడం లేదు. ఈ నేపథ్యంలో రెండో దఫా శాంతి చర్చలు ప్రారంభం కాకుండానే విఫలమైనట్టు కనిపిస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




