– హరీష్ రావు దిల్లీ పర్యటనపై అనుమానాలు
– ఎంపీ చామల కిరణ్ రెడ్డి వ్యాఖ్య
హైదరాబాద్,ప్రజాతంత్ర, ఏప్రిల్20: జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో ఒక్క రోజు వీఐపి మాత్రమేనని ఎంపీ చామల కిరణ్ రెడ్డి అన్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని ఎంపీ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ జీవన్ రెడ్డి చేరిక వాళ్ల కార్యకర్తలకే ఇష్టం లేదని తెలిపారు. ఆయన కాంగ్రెస్ లో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని విమర్శించారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ సముచిత స్థానం ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ లో చేరిన సీనియర్ నేతల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. జీవన్ రెడ్డిని చేర్చుకుని కాంగ్రెస్ బలహీన పడిందని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ మునిగిపోయే పడవ అంటూ ఎంపీ కిరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక మాజీ మంత్రి హరీశ్ రావు దిల్లీ టూర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో ముసలం మొదలైందన్నారు. జీవన్ రెడ్డిని ఎప్పుడూ హరీశ్ రావు పార్టీలోకి ఆహ్వానించలేదని తెలిపారు. జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లినప్పుడు హరీశ్ వెళ్లలేదన్నారు. రెండవసారి జగిత్యాలకు వెళ్లేటపుడు కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్లి బతిమిలాడి తీసుకువెళ్లారంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇంటికి జీవన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా హరీశ్ రావు వెళ్లలేదని ఎంపీ తెలిపారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకున్నారన్నారు. కేసీఆర్ సంవత్సరం తర్వాత ఫామ్హౌస్ నుంచి బయటకు వస్తుంటే హరీష్ రావు దిల్లీ వెళ్లారంటూ వ్యాఖ్యానించారు. హరీష్ రావు దిల్లీలో ఎవరిని కలిసి మాట్లాడారు అనేది త్వరలో బయటకు వస్తుందన్నారు. హరీష్ భవిషత్తు ప్రణాళికలు ఏంటి అనేది ప్రజలకు తెలుసన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





