తెలంగాణ టూరిజానికి కొత్త పుంతలు..

గ్రామీణ పర్యాటకంపై సర్కారు స్పెషల్ ఫోకస్
మిస్ వరల్డ్ ఈవెంట్ షెడ్యూల్ లో కంటెస్టెంట్లకు ఫీల్డ్ టూర్
అందాల పోటీలతో పల్లెలకు ప్రపంచవ్యాప్త ప్రచారం
గ్రామీణ పర్యాటక వృద్ధికి ఊతమిచ్చేలా కార్యక్రమాలు

హైదరాబాద్. ప్రజాతంత్ర, మే 7 : తెలంగాణ పర్యాటకాన్ని ప్రగతి పథకంలో నడిపించేందుకు రాష్ట్ర సర్కారు సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది. మిస్ వరల్డ్ ఈవెంట్లను పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు  గ్రామీణ పర్యాటకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు ప్రాధాన్యతమిస్తోంది. తెలంగాణ గ్రామీణ సాంస్కృతిక, చారిత్రక, పర్యాటక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు మిస్ వరల్డ్ ఈవెంట్ ను అందివచ్చిన అద్భుత అవకాశంగా ప్రభుత్వం ఉపయోగించుకునేందు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. 120 దేశాల ప్రతినిధులు హాజరయ్యే… 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమయ్యే మిస్ వరల్డ్ పోటీలు ఈవెంట్ లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్,  గ్రామీణ పర్యాటకానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖంగా ప్రమోట్ చేసేందుకు, పెద్ద ఎత్తున విదేశీ పర్యాటకులను ఆకర్షించుకునేందుకు తద్వారా గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చేందుకు  అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.

మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా  వరంగల్, హన్మకొండ , ములుగు, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్  జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను షోకేజ్ కు చేసేందుకు రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను  మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లు సందర్శించనున్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్ లో భాగంగా ఈనెల 12న ఆధ్యాత్మిక టూరిజానికి చిహ్నంగా ఉన్న  నాగార్జున సాగర్ లోని బుద్ధవనాన్ని, బుద్ధిష్టు థీమ్ పార్కును మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించనున్నారు.

ఈనెల 14న  చారిత్రక, ఆధ్యాత్మిక నగరం వరంగల్ లోని వేయి స్తంభాల గుడి, వరంగల్ ఖిలాను సందర్శిస్తారు. ఇదే రోజు వరంగల్ జిల్లాలో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన పేరిణి నృత్యాన్ని తిలకిస్తారు. ఈనెల15 న  మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు ఆధ్యాత్మిక టూరిజం లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శిస్తారు. హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్సల్ టూర్ లో భాగంగా పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీని, ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకిస్తారు.
ఈనెల 16 న  మహబూబ్ నగర్ జిల్లాలోని లోని పిల్లలమర్రి వృక్షాన్ని సందర్శిస్తారు.

21న  శిల్పారామంలో తెలంగాణ కళాకారులతో నిర్వహించే ఆర్ట్స్ , క్రాఫ్ట్స్ వర్క్ షాప్ హాజరవుతారు. స్వయంగా వాటి తయారీలో భాగమై ప్రత్యక్షంగా తయారీ గురించి తెలుసుకుంటారు.  మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో  ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ గ్రామీణ పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రచారం దక్కనుంది. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక గాథలు, ఆధునిక అభివృద్ధి, పర్యాటక ప్రాముఖ్యత ను ప్రపంచానికి తెలుపడంతో పాటు తెలంగాణ గ్రామీణ పర్యాటక ప్రదేశాలను ప్రపంచ పటంలో ప్రముఖంగా నిలిపే అవకాశం లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page