మనమంతా సైన్యం వెంటే ఉందాం..

ఇలాంటి సమయంలో రాజకీయాలకు తావు లేదు..
సైన్యానికి మనో ధైర్యం ఇచ్చేలా నేడు ర్యాలీ
అసత్య ప్రచారాలు చేసే వారిపై ఉక్కుపాదం
హాస్పిటల్‌లు, మందులు, రక్త నిల్వలు సన్నద్ధం చేసుకోండి
ఉద్యోగులు, అధికారులు, మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు
అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  ఆదేశాలు
ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంలో సీఎం అత్యవసర సమావేశం 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర,మే 7 : ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో సైన్యంతో మనమంతా వెన్నంటి ఉన్నామనే సందేశం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి  అన్నారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇలాంటి సమయంలో రాజకీయాలకు తావు లేదన్నారు. అత్యవసర సేవలు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు, మంత్రులు, అధికారులందరూ అందుబాటులో ఉండాలన్నారు. మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులు, మీడియా, సోషల్‌ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్‌ఫ్రీ నంబర్‌ సిద్ధం చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించనున్నారు. నగరంలోని సెక్రటేరియట్‌ నుంచి నెక్లెస్‌ రోడ్‌ వరకు ఇది కొనసాగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు.

ఇండియన్‌ ఆర్మీ పాకిస్తాన్‌ ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. ఈ నేపథ్యంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, డీజీపీ జితేందర్‌,హోం సెక్రటరీ రవి గుప్తా, ఆర్మీ, పోలీస్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల రక్షణకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్‌ నుంచి నెక్లెస్‌ రోడ్‌ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలని అన్నారు.

బ్లడ్‌ బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్దం చేసుకోవాలని చెప్పారు. అత్యవసర మెడిసిన్‌ సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రైవేటు హాస్పిటళ్లలో బెడ్ల అందుబాటుపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రెడ్‌ క్రాస్‌ సమన్వయం చేసుకోవాలన్నారు. ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలని తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలని హెచ్చరించారు. ఫేక్‌ న్యూస్‌ను అరికట్టడానికి ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ రూంకి అనుసంధానం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భధ్రతను పెంచాలని సూచించారు. హైదరాబాద్‌లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భధ్రతను పెంచాలని ఆదేశించారు. ఐటీ సంస్థల దగ్గర భద్రతను పెంచాలన్నారు. హైదరాబాద్‌ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే పీస్‌ కమిటీలతో మాట్లాడాలని సూచించారు. రౌడీషీటర్‌లపై, పాత నేరస్తుల పట్ల పోలీస్‌ శాఖ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page