ఇందిరమ్మ రాజ్యంతోనే సొంతింటి కల సాకారం
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కోయ తెగకు చెందిన కుటుంబంతో భోజనం చేసిన మంత్రి
చర్ల, ప్రజాతంత్ర, మే 7 : రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు రాష్ట్రం మొత్తం పూర్తిస్థాయిలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం చర్ల మండలంలోని సుబ్బంపేట గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారులు ఎస్టి కోయ తెగకు చెందిన వాసం ముసలయ్య కుటుంబ సభ్యులతో కలిసి సన్న బియ్యంతో తయారుచేసిన వంటకాలను ఆయన రుచి చూశారు. రాష్ట్ర మంత్రి తన ఇంట్లో భోజనానికి రావడంతో ఆ కుటుంబానికి, ఆ గ్రామంలోని ప్రజల ఆనందానికి అవధులు లేవు. గిరిజన కుటుంబంలో భోజనం చేయడానికి వొచ్చిన ఆయనకు సన్న బియ్యంతో భోజనం, పాటు పాయసం, పులిహోర, సేంద్రీయ ఎరువులతో పండించిన తోటకూర పప్పు, గోంగూర చట్నీ, ఇతర ఆహార పదార్థాలను వడ్డించారు. మంత్రి సంతోషంగా తనివి తీరా భోజనం చేసిన తర్వాత కుటుంబ సభ్యులను అభినందించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీపై ప్రజల నుంచి మంచి స్పందన వొస్తుందని, చరిత్రరాత్మకమైన ఘట్టంలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామన్నారు. 80 శాతానికి పైచిలుకు బడుగు బలహీన, దళిత, గిరిజన, మైనార్టీ నిరుపేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. పేదవాడి సొంత ఇంటి కల ఇందిరమ్మ రాజ్యం తోనే సాధ్యమవుతుందని భావించి పూరి గుడిసెల్లో ఉంటూ పేదవారు కలల కంటున్న సొంతింటి కలను నెరవేర్చే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చర్ల మండలం సుబ్బంపేట గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, లక్ష్మీ కాలనీలో కోటి 16 లక్షలతో నిర్మించిన గ్రంథాలయం, తేగడ గ్రామంలో పుల్లరి సుధాకర్ సరోజిని దంపతుల ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటికి భూమి పూజ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16 నెలల్లో దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, పిఎస్పీసీ చైర్మన్ రవికుమార్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో బి రాహుల్, ఆర్డీవో దామోదర్ రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, హౌసింగ్ పీడీ శంకర్, డి ఆర్ డి ఓ విద్యా చందన, తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీ ఓ మస్తాన్ అలీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.