హెచ్ఆర్డి వైస్ ఛైర్పర్సన్గా శాంతికుమారి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె.రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈనెల 30 పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త సీఎస్ నియామకంపై గత కొంత కాలంగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. సీనియారిటీ జాబితా ప్రకారం.. రామకృష్ణారావు తోపాటు ఆరుగురు అధికారులు రేసులో నిలిచారు.
వారందరి పేర్లను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సమర్థత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రామకృష్ణారావును సీఎస్గా నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రామకృష్ణారావు సోమవారం సిఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సిఎం ఆయనను అభినందించారు. ఇదిలావుంటే పదవీవిరమణ చేస్తున్న సీఎస్ శాంతి కుమారికి కీలక బాధ్యత అప్పగించారు.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ) వైస్ ఛైర్పర్సన్ గా శాంతి కుమారి పేరును ప్రభుత్వం ప్రకటించింది. సీఎస్ పదవి విరమణ తర్వాత.. ఆమె ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.