ధరణి కష్టాలకు..భూ భారతితో ముగింపు

  • కొత్త చట్టంతో రైతుల భూములకు భద్రత
  • 5.45 లక్షల భూ సమస్యల పరిష్కారం..
  • గిరిజన ప్రాంతాల్లో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ..  
  • రాష్ట్రంలోని 28 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఒక్క మండలం ఎంపిక..
  • రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : నాటి ధరణితో రైతులకు ఏర్పడిన కష్టాలు తాము తీసుకొచ్చిన భూ భారతితో తీరిపోతాయని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టం- 2025 పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి పొంగులేటి పాల్గొని మాట్లాడారు. తరతరాలుగా అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా జీవిస్తున్న ఈ ప్రాంతంలో ఈ మాయదారి ధరణితో వారు శత్రువులుగా మారిపోయే పరిస్థితి వచ్చిందని, నాటి చట్టంలో లొసుగుల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. దానివల్ల గత ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే ప్రజల సమస్యల పరిష్కారానికి, పేదవాడి కన్నీరు తుడిచే విధంగా ప్రజలందరికీ ఉపయోగపడే భూభారతి చట్టాన్ని అంబేడ్కర్ జయంతి నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేశామన్నారు. గత ప్రభుత్వం అర్ధరాత్రి దొరవారి కుటుంబ సభ్యులు, అనుచరులకు ఉపయోగపడేలా ధరణి చట్టాన్ని రూపొందించారని విమర్శించారు.

తరతరాలుగా తాతలు, ముత్తాతలు నుంచి సాగు చేసుకుంటున్న భూమి.. ధరణి కారణంగా పాసుబుక్ లో నమోదు కాలేదని, దీని కోసం అధికారుల చుట్టూ తిరిగినా నాటి ధరణిలో అవకాశం కల్పించలేదని అన్నారు. ఈనాటి భూభారతిలో సామాన్య రైతులకు అటువంటి ఇబ్బందులు లేకుండా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగానే ఎమ్మార్వో, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిల్లో పరిష్కరించడానికి అవకాశం కల్పించామన్నారు. రైతుబంధు కోసం గత ప్రభుత్వం ధరణి చట్టం తీసుకువచ్చి భూమి కొనుక్కొని ఆ భూమి రిజిస్ట్రేషన్ చేస్తే మరికొన్ని డబ్బులు ఖర్చు చేసి మీరందరూ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే తప్పకుండా వాళ్లకి పట్టా ఇస్తామని ఆనాటి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, కానీ దరఖాస్తు చేసుకున్న 9 లక్షల 26 వేల మంది రైతులు దరఖాస్తులకు ఎటువంటి పరిష్కారం చూపలేదన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 5లక్షల 45 వేల దరఖాస్తులను పరిష్కారం చేశామని తెలిపారు. భూ సమస్యలపై రైతులు అధికారుల చుట్టూ తిరగనవసరం లేకుండా తహసీల్దార్లు ప్రతి గ్రామంలో రెవెన్యూ సభలు నిర్వహించడం ద్వారా దరఖాస్తులను సేకరించి వాటి పరిష్కరిస్తారని తెలిపారు.

రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో వొచ్చిన దరఖాస్తులను జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి పరిష్కారాలు చూపుతామన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మే రెండవ తేదీ నుంచి హైదరాబాద్ మినహా మిగిలిన 28 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని వొచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కరిస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుజాతానగర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని తెలిపారు. గిరిజన ప్రాంతంలో 170 చట్టం వల్ల తరతరాలుగా కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమని అన్నారు. గిరిజన ప్రాంతంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.

 

గిరిజన ప్రాంతంలో 170 చట్టం వల్ల తరతరాలుగా కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమని అన్నారు. గిరిజన ప్రాంతంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఆ కమిటీ గిరిజన ప్రాంతాల్లో భూ సమస్యల శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో 911, 152 సర్వే నెంబర్లలో ఇబ్బందులు ఉన్నాయని గత రివ్యూ మీటింగ్ లో ఎమ్మెల్యేలు తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిని పరిష్కరించామని, అవి త్వరలోనే ప్రజలకు అందుతాయని మంత్రి తెలిపారు. గతంలో భూ సర్వే చేయాలంటే మూడు నుంచి నాలుగు నెలలు పట్టేదని, రైతులకు ఇబ్బంది లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకుని అతి త్వరలోనే రాష్ట్రంలో భూ సర్వే చేపడతామన్నారు. గత ప్రభుత్వం వారి స్వప్రయోజన కోసం వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిందని, వారిలో అర్హులైన వారిని ఎంపిక చేసి రాష్ట్రవ్యాప్తంగా 10956 రెవెన్యూ గ్రామాల్లో ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉండేలా రెవెన్యూ అధికారులను నియమిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page