నీట్ సంక్షోభం మరింత తీవ్రం

ఇరవై మంది విద్యార్థుల ఆత్మహత్యలు, పరీక్షల అవకతవకలు, సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షతో విద్యా సంస్కరణలపై దేశవ్యాప్త డిమాండ్ వినిపిస్తుంది. భారతదేశంలోని పోటీ పరీక్షల వ్యవస్థ గత కొన్ని సంవత్సరాలలో ఎన్నడూ లేనంత విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నీట్-యూజీ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల ఆత్మహత్యలు, పరీక్షలలో అవకతవకల ఆరోపణలు, విద్యా సంస్కరణల కోసం సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల పారదర్శకత, విశ్వసనీయత మరియు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలకు దారితీశాయి.
తాజా విషాద సంఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో చోటుచేసుకుంది. జాతీయ పరీక్షల సంస్థ విడుదల చేసిన అధికారిక ఆన్సర్ కీ ఆధారంగా తన మార్కులను అంచనా వేసుకున్న 18 ఏళ్ల నీట్ అభ్యర్థిని ఆశించిన ఫలితం రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆమె నివాసముంటున్న అపార్ట్మెంట్ 16వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న ఈ ఘటన కుటుంబ సభ్యులను, సహ విద్యార్థులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ ఘటన దేశంలోని అత్యంత క్లిష్టమైన ప్రవేశ పరీక్షలలో ఒకటైన నీట్కు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్రమైన మానసిక ఒత్తిడిని మరోసారి వెలుగులోకి తెచ్చింది. దీర్ఘకాలిక చదువు ఒత్తిడి, అపజయం పట్ల భయం, పరీక్షల అనిశ్చితి, కుటుంబం మరియు సమాజం నుంచి వచ్చే అంచనాలు యువతను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయని మానసిక ఆరోగ్య నిపుణులు పలుమార్లు హెచ్చరిస్తున్నారు. ఈ విషాదం జరుగుతున్న సమయంలోనే నీట్-యూజీ పరీక్షలపై వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, పరీక్షల రద్దు, న్యాయపరమైన వివాదాలు, మళ్లీ పరీక్షల నిర్వహణ వంటి పరిణామాలు లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర అనిశ్చితిని సృష్టించాయి. ప్రవేశాలు, ర్యాంకులు, పరీక్షల ఫలితాలపై నెలల తరబడి కొనసాగిన సందిగ్ధ పరిస్థితి దేశంలోని అత్యంత కీలక వైద్య ప్రవేశ పరీక్ష విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ నేపథ్యంలో విద్యావేత్త, ఆవిష్కర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ న్యూదిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. యువత ఆధ్వర్యంలోని కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఉద్యమానికి ఆయన మద్దతు తెలుపుతున్నారు. పోటీ పరీక్షలలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై సమగ్ర దర్యాప్తు, ముఖ్యంగా నీట్ ప్రశ్నాపత్ర లీక్ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు, పరీక్షల నిర్వహణలో బాధ్యతాయుత వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఈ ఉద్యమం డిమాండ్ చేస్తోంది. పరీక్షల నిర్వహణలో వైఫల్యాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా ఉద్యమకారులు కోరుతున్నారు.“పోటీ పరీక్షలలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై సమగ్ర దర్యాప్తు, ముఖ్యంగా నీట్ ప్రశ్నాపత్ర లీక్ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు, పరీక్షల నిర్వహణలో బాధ్యతాయుత వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఈ ఉద్యమం డిమాండ్ చేస్తోంది. పరీక్షల నిర్వహణలో వైఫల్యాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా ఉద్యమకారులు కోరుతున్నారు..”-డా. ముచ్చుకోట సురేష్ బాబు


-డా. ముచ్చుకోట సురేష్ బాబు 


