విత్తనం మరణిస్తూ మొక్కను వాగ్దానం చేయడం ప్రకృతిలో ఒక శాశ్వత సత్యం. అదే విధంగా వీరుడు మరణిస్తూ మరో పోరాటాన్ని వాగ్దానం చేస్తాడు. అమరుడు తన రక్తాన్ని విత్తనాలుగా చల్లుతూ భవిష్యత్ ఉద్యమాలను వాగ్దానం చేస్తాడు..ఇదంతా ఎందుకంటే కేంద్రం డెడ్ లైన్ పెట్టుకుని మరీ మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసింది. మావోయస్టు ముక్త్ భారత్ అయ్యిందంటూ పార్లమెంట్లో గొప్పగా ప్రకటించుకుంది. కేంద్రం పెట్టుకున్న డెడ్ లైన్ ముగిసింది కానీ మావోయిస్టు పార్టీ అంతం కాలేదు. భద్రతా బలగాల తీవ్ర నిర్బంధం,అణచివేతలు, అర్ధ సైనిక మిలటరీ, కోవర్ట్ అపరేషన్లు వరుస ఎన్కౌంటర్, అగ్రనేతల లొంగుబాట్ల ఎదురుదెబ్బలతో వెనుక సెట్ బ్యాక్ అయ్యింది తప్ప అంతం కాలేదు.మావోయిస్టు పార్టీ అంతమయ్యే అవకాశమే లేదని కేంద్రమే పరోక్షంగా ఒప్పుకుంటుంది. అందుకే ఒకవైపు మావోయిస్టు ముక్త్ భారత్ అయిందంటూనే మరోవైపు దండకారణ్యంతో కూంబింగ్ చేస్తుంది.గతంలో కంటే ఎక్కువ నిఘా దండకారణ్యంలో పెట్టుతుంది.
దేశంలో నక్సలిజం లేదని, మావోయిస్టు ఉద్యమం అంతమైందని నక్సల్ రహిత భారతదేశమంటూ కేంద్రం ప్రకటించుకున్న సంతోషం మూనాళ్ల ముచ్చటగానే మిలిగింది.మధ్య భారత్లో అన్నలు లేరని వారి పోరాటాలు లేవని అక్కడి మూల వాసులను వారి స్వస్థలాల నుంచి వెళ్లగొట్టుతూ దండకారణ్యం వ్యాప్తంగా విస్తరించి ఉన్న విలువైన భూములు, ఆ భూముల్లో ఉన్న సహజ భూగర్భ వనరులను భారత ప్రభుత్వం బడా కార్పొరేట్ కంపెనీల దోపిడీకి ధారాదత్తం చేస్తున్నారు. .అభివృద్ది పేరుతో మధ్య భారత్లో విధ్వంసం సృష్టిస్తున్నారు.మల్టీనేషనల్ కంపెనీల విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసులు పోరాటం చేస్తున్నారు.అయితే ఆ పోరాటాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా కేంద్రం సైనికులతో దండకారణ్యం చుట్టూ సైనిక వలయాన్ని నిర్మించింది. ఆదివాసుల పోరాటం మాత్రం నివురుగప్పిన నిప్పులా దండకారణ్యం లోపల రగులుతూనే ఉంది.
.అన్నలు లేని రాజ్యం ఎప్పటికీ సాధ్యం కాదు.ప్రభుత్వాల అణచివేత ఎంత పెరిగితే వారి రూపాలు అంతగా మారుతాయని చరిత్ర నిరూపిస్తుంది.అన్నలు పీపుల్స్ వార్గా. పీపుల్స్వార్ మావోయిస్టులుగా మావోయిస్టులు మరో రూపంగా పురుడు పోసుకుంటుంది. ప్రభుత్వలు పాలకుల అణచివేత, హక్కులను హరించినంత కాలం, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అమలు చేయకుండా నియంతృత్వ పాలన విధానాలు ఉన్నన్ని రోజులు పోరాటం ఏదో రూపంలో ఉంటూనే ఉంటుంది.ప్రజల తిరుగుబాటు రూపంలో కనిస్తూనే ఉంటుంది. తాజాగా దేశంలో మావోయిస్టు పార్టీలేదని, మావోయిస్టు పోరాటాలు లేవంటూ ప్రకటించుకున్న కేంద్రానికి, మేమున్నాం ఉద్యమం ఆగదన్న మావోయిస్టు పార్టీ ప్రకటన పోరాటాలకు అంతముండదు తాత్కాలిక విశ్రాంతే అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ. అమరత్వానికి ప్రతీకగా అయిన ఫీనిక్స్ పక్షి మంటల్లో కాలిపోయి, తన స్వంత బూడిద నుండి కొత్త జీవంగా పునర్జన్మతో కొత్త ఆరంభాలకుపురుడు పోసినట్లు మావోయిస్టు పార్టీ కూడా అనేక ఉద్యమ పాఠాల నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటూ మళ్లీ మళ్లీ పురుడు పోసుకుంటూనే ఉంది. మావోయిస్ట్ ఉద్యమం ముగిసిందన్న ప్రతిసారీ ఏదో రూపంలో ముందుకు వస్తూనే ఉంది.
మరణిస్తాం మరణిస్తాం ప్రజల కోసం మరణిస్తాం..మళ్లీ పుడతాం మళ్లీ పుడతారు పీడితుల విముక్తి కోసం మళ్లీ పుడతాం అమరులు త్యాగాలు చేస్తూ మరో పోరాటాన్ని వాగ్దానం చేస్తూ భరోసా ఇస్తారు. దండకారణ్యంలో మావోయిస్టు ఉద్యమం మళ్లీ పురుడు పోసుకుంటుంది. అమరులు చల్లిన త్యాగాల విత్తనాలు మొలకెత్తున్నాయి. పోరులో ఒరిగిన వీరుల నెత్తురుతో తడిచిన గోదావరి ఇంద్రావతి నదుల పరివాహక మధ్య భారత్లో ఉద్యమ విత్తనాలు మరో పోరును వాగ్దానం చేస్తూ మొలకెత్తుతున్నాయి. ప్రభుత్వాలు తమ ఓటమిని కప్పించుకునేందుకు దేశంలో మావోయిస్టు పార్టీ లేదని ప్రకటించుకోవచ్చు కానీ గ్రౌండ్లో పరిస్థితి కేంద్రం ప్రకటనకు భిన్నంగా ఉందని తాజాగా మావోయిస్టు పార్టీ ప్రకటన ప్రభుత్వానికి షాకించే చేధు నిజంలాంటిది.
మేమున్నాం..ఉద్యమం ఆగదు అంటూ మావోయిస్టు పార్టీ ప్రకటన. గచ్చిరోలిలో మావోయిస్టు పార్టీ పేరుతో, అశోక్ కమ్రాద్ పేరుతో వెలిసిన వాల్ పోస్టర్స్,కరపత్రాలు విడుదల.మావోయిస్టులు కేంద్రానికి ఇచ్చిన షాకింగ్ వార్తే. షాక్ మాత్రమే కాదు సవాల్ కూడా. ఈ ప్రకటన చాలా చిన్న ప్రకటనే కావచ్చు.కానీ నిరాశ నిస్పృహలో ఉన్న పీడిత తాడిత జనాల్లో నూతన జవ సత్వాలను నింపుతుంది. మావోయిస్టు ముక్త్ భారత్ అంటూ గత కొన్ని నెలలుగా కేంద్రం ప్రచారం చేస్తోంది.వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, కోవర్ట్ ఆపరేషన్లతో నక్సలిజం అయిపోందని కేంద్రం ప్రకటించింది.మార్చి 31 డెడ్ లైన్ పెట్టుకుని మరీ కేంద్రం సైనిక ఆపరేషన్లు నిర్వహించింది..డెడ్ లైన్ ముగిసింది. మావోయిస్టు పార్టీ సజీవంగానే ఉంది.అందుకే ఇప్పటికి రహస్యంగా కొనసాగిస్తుంది.
ఇప్పటికీ కేంద్రానికి అంతుచిక్కకుండా కేంద్ర కమిటీ సభ్యులు అజ్ఞాతంలో ఉన్నారు..పీపుల్స్ వార్ నుంచి మావోయిస్ట్ పార్టీతో దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించిన సుదీర్షకాలం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ముప్పాల లక్ష్మణ్ అలియాస్ గణపతి అతని సహచరి మరో పొలిట్ బూరో సభ్యుడు ఎక్కడ ఉన్నారో కేంద్రానికి అంతుచిక్కడం లేదు.ఎంతో అడ్వాన్డ్స్ టెక్నాలజీ ఉన్నప్పటికీ వారి ఆచూకీని ప్రభుత్వాలు కనిపెట్ట లేకపోతున్నాయ. వాళ్లు పార్టీని పునర్ నిర్మించే వ్యూహంలో ఉన్నట్లు వార్తుల వస్తున్నాయి.ఇప్పుడు వాళ్ల ఉనికి రాజ్యానికి సవాల్ గా మారింది. గచ్చిరోలిలో ఉద్యమం బలంగా ఉందంటూ మేమున్నాం. ఉద్యమం ఆగదంటూ అశోక్ కమ్రాద్ పేరుతో పోస్టర్ల విడుదలతో కేంద్రం ఉలిక్కి పడ్డది..మావోయిస్టు పార్టీ అంతమైందని దండకారణ్యంలో విలువైన సహజ సంపదను మల్టినేషనల్ కంపెనీలకు తాకట్టుతున్న తరుణంలో మావోయిస్ట్ పార్టీ ప్రకటన కేంద్రానికి సవాల్ గా మారింది.
“అంతేకాదు మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడంతోనే అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా విపరీతంగా పెరిగిందన్నది రాష్ట్రాల పోలీసున్నాధికారులు బహిరంగానే ప్రకటిస్తున్నారు. మావోయిస్టులు కొండ ప్రాంతాలలో గంజాయి సాగును అడ్డుకునేవారని, వారి కదలికలు తగ్గిపోవడంతో దాన్ని స్మగ్లర్లు ఆసరాగా చేసుకుని అక్రమ దందాకు పాల్పడుతున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..”-తోటకూర రమేష్
దండకారణ్యంలో కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేక ఓడిస్సాలో గిరిజన పోరాటాలు ఊపందుకున్నాయి. బాక్సైట్ , యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు ఆందోళనలు చేస్తున్నారు..అటు మైదాన ప్రాంతంలో లాకప్ డెత్ లు పెరిగాయి.పాలక వర్గాల అండతో మళ్లీ అధిపత్య వర్గాల దోపిడి పెరిగింది..క్రైమ్ రేట్ పెరిగింది.ప్రభుత్వాల అణచివేత పెరిగింది.చట్టం రాజ్యాంగా బద్దంగా నడుచుకోవాల్సిన పోలీసులు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి వేధించే అధికార పార్టీల ఏజెన్సీలుగా మారాయి. అటు దేశంలో పేపర్ లీక్లతో విద్యా వ్యవస్థ వ్యవస్థాగత క్షీణత ఎదుర్కొంటుంది. రాజకీయ పార్టీల విచ్ఛిన్నం, బహుళ కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు, నడుము విరిచే ధరల పెరుగుదల, విదేశాంగ విధాన వైఫల్యాలు మరియు వ్యూహాత్మక తప్పిదాలు, కోట్లాది వాహన యజమానులపై ఇథనాల్ మిశ్రమాన్ని బలవంతంగా రుద్దడం, అడ్డూ అదుపు లేని అడవి నిర్మూలన, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల హక్కులపై నిరంతర దాడి , ప్రజల జీవితాలు, ఆకాంక్షలను ప్రభావితం చేస్తున్న ఆలాంటి తీవ్రమైన సమస్యలు దేశాన్ని పట్టి పీడుస్తున్నాయి. వీటిని అడ్రస్ చేయడంలో ప్రతిపక్షం విఫలమైంది. దండకారణ్యంలో ఒడిసాలో కార్పొరేట్ కంపెనీల విధ్వంసానికి వ్యతిరేకంగా గిరిజనులు చేస్తున్న పోరాటానికి కనీసం కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మద్దతు తెలపడం లేదు.
ప్రతిపక్షాలు పట్టించుకోకున్నా దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అరాచక నియంతృత్వ పాలనపై ప్రజలు మాత్రం ఏదో రూపంలో ఎక్కడో ఒక చోట పోరాటం చేస్తూనే ఉన్నారు.ప్రజల పోరాటాలను సంఘటితం చేసే వ్యవస్థను కేంద్రం చెల్లచెదురు చేసింది.సంఘటితం చేయాల్సిన ప్రతిపక్షం విఫలమైంది. అటు ప్రజాస్వామ్య బద్ధంగా, రాజ్యాంగం పరిధిలో ప్రజా పోరాటం చేస్తామన్న మాజీలు మౌనంగా ఉన్నారు. కారణాలు ఏమైనా కావచ్చు లొంగిపోయిన మాజీలు ఆరు నెలలు దాటిన ప్రత్యేక్ష ప్రజా పోరాటంలో కనిపించడం లేదు. లొంగుబాటు సమయంలో ప్రజలకు వాగ్దానం చేసినట్లు ఎక్కడ ప్రజా ఉద్యమంలో రాజ్యాంగ పరిధిలో జరిగే విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికుల పోరాటాల్లో పాల్గొనడం లేదు. అటు మావోయిస్టు ఉద్యమానికి ఇటు ప్రజలకు ఒక రకంగా వాగ్దాన భంగానికి పాల్పడ్డారు. దీంతో ప్రజల్లో, అజ్ఞాతంలో ఉన్న వారిలో కూడా మాజీలపై విశ్వాసం, ప్రజలకు ఏదో చేస్తారన్న నమ్మకం సన్నగిల్లింది. బయటకు వచ్చిన మాజీలపై తమకు ఏదో చేస్తారన్న భ్రమలు ప్రజల్లో తొలిగాయి.
దీంతో విశ్వాసం కోల్పోయిన ప్రజల్లో విశ్వాసం నింపడానికి మేమున్నాం..ఉద్యమం ఆగదు అంటూ మావోయిస్టు పార్టీ ప్రకటన కొత్త ఉత్సహం నింపుతుంది. ఈ ప్రకటన ప్రభుత్వానికి షాక్ ఇవ్వడమే కాదు. దీనంగా చూస్తున్న అభాగ్యుల్లో భరోసా నింపుతుంది. ప్రజలు సంక్షోభ పరిస్థితిని ఎదుర్కున్నప్పుడు ప్రకృతే పోరాటాలకు పురుడు పోస్తుంది. నాయకులను సృష్టిస్తుంది. ఇప్పుడు దేశంలో ప్రజలు సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నారు. అంతేకాదు మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడంతోనే అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా విపరీతంగా పెరిగిందన్నది రాష్ట్రాల పోలీసున్నాధికారులు బహిరంగానే ప్రకటిస్తున్నారు. మావోయిస్టులు కొండ ప్రాంతాలలో గంజాయి సాగును అడ్డుకునేవారని, వారి కదలికలు తగ్గిపోవడంతో దాన్ని స్మగ్లర్లు ఆసరాగా చేసుకుని అక్రమ దందాకు పాల్పడుతున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి సమాజానికి, సమాజ చైనత్యానికి మావోయిస్టులు ఎంత అవసరమో అర్థం చేసుకొచ్చు.
ప్రజా ఉద్యమాలు సెట్ బ్యాకై, ప్రభుత్వాలు, ప్రతిపక్షం ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో విఫం కావడంతో ప్రజలు ప్రత్యామ్నాయ వ్యవస్థ నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు.తాజాగా మావోయిస్టు పార్టీ ప్రకటన అలసిపోయిన ప్రజల ఆశా కిరణంగా నిలుస్తోంది.. మావోయిస్టు పార్టీ ఇచ్చిన ప్రకటన చిన్నదే కావచ్చు..దాని ప్రభావం మరో ఉద్యమ ఉదయానికి పునాది అవుతుంది..ఆ ప్రకటనకు మీడియా, ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు కానీ ఏదో ప్రత్యామ్నాయ వ్యవస్థ నిర్మాణం అవుతుందని మాత్రం ప్రభుత్వానికి సవాలే..పేదలకు అభాగ్యులకు అణచివేతకు గురయ్యే బడుగు బలహీన వర్గాల దృష్టిలో ఒక ఉదయిస్తున్న విప్లవమే..ఆ విప్లవ చైతన్య కిరణాల వెలుతురు కోసం ఎదురుచూస్తున్నారు..!!


-తోటకూర రమేష్ 


