– నాలుగు నెలలుగా జాడ లేదు
– భర్త ఆచూకీ కోసం భార్య ఆందోళన
– సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసిపేటకు చెందిన ప్యాట విజయ్ కుమార్ (38) మలేసియాలో నాలుగు నెలల క్రితం తప్పిపోయిన సంఘటన జరిగింది. తన భర్త జాడ వెతికి ఇండియాకు రప్పించాలని భార్య జ్యోతి మంగళవారం హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్లో మంగళవారం జరిగిన సీఏం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆమెకు మార్గదర్శనం చేశారు. 2025 మే 28న ఇండిగో విమానంలో చెన్నై నుంచి కౌలాలంపూర్కు చేరుకున్న విజయ్ రెండు రోజులు డ్యూటీ చేసిన తర్వాత మానసికంగా కుంగిపోయి అసహనంతో ప్రవర్తిస్తున్నట్లు తెలియగానే అతన్ని ఇండియాకు రప్పించడానికి అతని భార్య జ్యోతి టికెట్ కోసం జూన్ 3న రూ.30 వేలు ఏజెంట్కు పంపించింది. కానీ, జూన్ 6 నుంచి అతను జాడ తెలియకుండా పోయాడు. తాటికల్లు, ఈతకల్లులో డైజోఫాం, క్లోరోఫాంలను కలిపి తయారు చేసిన గుల్ఫారం కల్లు ప్రభావంతో మతిస్థిమితం కోల్పోయినట్లు తెలుస్తున్నది. సహాయం కోసం నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురిని, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డిని, బోధన్ పోలీసులను గతంలో ఆమె కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై విభాగం ద్వారా జులైలో మలేసియాలోని ఇండియన్ హైకమిషన్ను సంప్రదించినా ఇప్పటివరకు ఆచూకీ విషయంలో పురోగతి లేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





