- ఉత్తమ లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్
- ఎస్సీల వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ
- తెలంగాణను అగ్రస్థానంలో నిలుపుతాం
- మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
సూర్యాపేట, ప్రజాతంత్ర, జూన్ 02 : తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధికి దిక్సూచిలాగా ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, జిల్లా ఎస్పి నరసింహ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తో కలసి మంత్రి పాల్గొన్నారు. ముందుగా అమరవీరులకి నివాళులు అర్పించి, పోలీసుల చే గౌరవ వందనం స్వీకరించి, తెలంగాణ తల్లికి, జాతీయ నాయకులకి పుష్పాంజలి ఘటించి జాతీయ పతాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలపన, తెలంగాణ రాష్ట్ర గేయం ఆలపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి నేటితో 11 ఏళ్లు నిండాని, ఈ రోజు రాష్ట్ర మంతటా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు వైభవంగా జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలకు శుభాకాక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఏర్పరచడాలని 1969లో మొదలైన ఉద్యమం దాదాపుగా 60 సంవత్సరాలు కొనసాగి, జూన్ 2, 2014న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్`2047 విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడిరచారన్నారు.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయని అవి పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూకల్పన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలను ప్రాధాన్యమిస్తారని అన్నారు. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది, అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఆర్టీసి బస్సులో ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలో 2535 964 మంది రైతులను రుణ విముక్తులు చేశామన్నారు. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12వేల ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. పేదల ఆకలి తీర్చడంతో పాటు, వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పథకాలను అమలుచేస్తున్నామని అన్నారు. సంక్షేమంతో పాటు, సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తుందని, దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కిందన్నారు. రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేపట్టి మొత్తం 4.50 లక్షల గృహ నిర్మాణాల ప్రారంభం మరియు నిర్మాణ దశలను బట్టిలబ్ధిదారునికి ఖాతాలో నగదు జమచేయడం జరుగుతుందన్నారు.
జిల్లాలో 8022 యూనిట్లకు గాను 4828 యూనిట్లను గ్రౌండిరగ్ చేయడం జరిగిందని, రూ.5 కోట్లతో మహిళా శక్తి భవనం మంజూరు అయినదని తెలిపారు. జిల్లాలో 6408 సభ్యులతో 181 కొత్తగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశామని, సమీకృత జిల్లా కార్యాలయం నందు క్యాంటీన్ ను మహిళా స్వయం సహాయ సంఘానికి ఇచ్చామన్నారు. . 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు 413 మంది రైతులకు సంబంధించిన వారి నామినీలకు రూ.20 .65 కోట్లు రూపాయలు జమ చేయడం జరిగిందని, రైతులను అప్పుల నుండి విముక్తి చేయడానికి ప్రభుత్వం రైతు బంధు ప్రథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇప్పటి వరకు 2,44,426 మంది రైతులకు ప్రత్యేక బదిలీ ద్వారా రూ.227.44 కోట్లు మొత్తాన్ని బదిలీ చేశారని తెలిపారు. భూముల స్వచ్ఛత, రికార్డు పరిరక్షణ, రైతులకు భూమిలో న్యాయమైన హక్కుల స్థిరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని 2025 ఏప్రిల్ 14వ తేదీ నుండి అమలులోకి తెచ్చిందని అన్నారు. తదుపరి విద్యార్ధులచే ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలని తిలకించి విద్యార్ధులచే మంత్రి ఫోటోలు దిగారు. వివిధ శాఖలచే ఏర్పాటు చేసిన స్టాల్స్లో సమాచార పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు, ఆర్డిఓ వేణు మాధవ్, డిఆర్డిఓ పిడి అప్పారావు, డిఎఫ్ఓ సతీష్ కుమార్, పశుసంవర్థక జిల్లా అధికారి శ్రీనివాస్, కల్చరల్ టీమ్, శంకర్, అశోక్, రమేష్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.